Chapter_191-200

Back
Book Shanthi Parvam-II
Chapter No 10
Pages 86
Read Time 98 Minutes

Chapter_191-200

ఏకనవత్యధిక శతతమోఽధ్యాయః

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

దానస్య కింఫలం ప్రాహు ర్ధర్మస్య చరితస్య చ,

తపసశ్చ సుతప్తస్య స్వాధ్యాయస్య హుతస్య వా 1

దానము, చక్కగా ఆచరించిన ధర్మము, మిక్కిలి శ్రద్ధతో చేసిన తపస్సు. స్వాధ్యాయము, హోమకార్యము అనువాని ఫలము ఏమని చెప్పుదురు?

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

హుతేన శామ్యతే పాపం స్వాధ్యాయైః శాన్తి రుత్తమా,

దానేన భోగా నిత్యాహు స్తపసా స్వర్గ మాప్నుయాత్. 2

హుతముచేత పాపమణగును. వేదాధ్యయనములచేత ఉత్తమమగుశాంతి లభించును. దానముచేత భోగములు కలుగును. తపస్సుచేత నరుడు స్వర్గమును పొందును.

దానం తు ద్వివిధం ప్రాహుః పరత్రార్థ మిహైవ చ,

సద్భ్యో యద్దీయతే కిఞ్చి త్తత్పర త్రోపతిష్ఠతే. 3

దానము రెండు విధములని చెప్పుదురు. పరలోకము కొఱకు, ఈ లోకము కొరకును అని. ఉత్తమ గుణములు కలవారి కిచ్చిన దేకొంచెమైనను అది పరలోకమునందు నిలుచును.

అసద్భ్యో దీయతే యత్తు తద్దాన మిహ భుజ్యతే,

యాదృశం దీయతే దానం తాదృశం ఫలమశ్నుతే. 4

చెడునడవడి కలవారి కిచ్చినది ఈ లోకమునందే అనుభవమునకు వచ్చునది. ఏ విధమగు దానము చేసినచో ఆ విధమగు ఫలము కలుగును.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

కిం కస్య ధర్మాచరణం కిం వా ధర్మస్య లక్షణమ్,

ధర్మః కతివిధో వాఽపి తద్భవాన్ వక్తు మర్హతి. 5

ఏది ఎవనికి ధర్మాచరణ మగును? ధర్మము లక్షణమేమి? ధర్మము ఎన్ని విధములైనది? దీనిని తమరు చెప్పవలయును.

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

స్వధర్మాచరణే యుక్తా యే భవన్తి మనీషిణః,

తేషాం స్వర్గఫలావాప్తి ర్యోఽన్యథా స విముహ్యతి. 6

ఏ బుద్ధిశాలులు తమ ధర్మము నాచరించుటయందు శ్రద్ధ గలవారో వారికి స్వర్గ ఫలము లభించును. వేరు విధముగా చేయువాడు మోహము నందును.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

యదేత చ్చాతురాశ్రమ్యం బ్రహ్మర్షి విహితం పురా

తేషాం స్వేస్వే సమాచారా స్తన్మే వక్తు మిహార్హసి. 7

మునుపు బ్రహ్మర్షు లేర్పరచిన నాలుగు ఆశ్రమముల ధర్మమును, వారికి ఆయా ఆశ్రమములందు పాటింపదగిన చక్కని ఆచారములను, నాకు తమరు తెలుపవలయును.

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

పూర్వమేవ భగవతా బ్రహ్మణా లోకహిత మనుతిష్ఠతా ధర్మ సంరక్షణార్థ మాశ్రమా శ్చత్వారోఽభి నిర్దిష్టాః-

మొదటనే భగవంతుడు బ్రహ్మ లోకహితమును చేయగోరినవాడై ధర్మ సంరక్షణము కొరకు నాలుగు ఆశ్రమములను ఏర్పరచెను.

తత్ర గురుకులవాస మేవ ప్రథమ మాశ్రమ ముదాహరన్తి.

అందు గురుకులవాసమే మొదటి ఆశ్రమముగా చెప్పుదురు.

సమ్యగ్యత్ర శౌచ సంస్కార నియమవ్రత వినియతాత్మా ఉభే సన్ద్యే భాస్కరాగ్ని దైవతాన్యుపస్థాయ, విహాయ తన్ద్రాలస్యే, గురోరభివాదన వేదాభ్యాసశ్రవణ పవిత్రీకృతాంత రాత్మా త్రిషవణ ముపస్పృశ్య బ్రహ్మచర్యాగ్ని పరిచరణ గురుశుశ్రూషా నిత్యభిక్షా భైక్ష్యాది సర్వనివేదితాంతరాత్మా గురువచన నిర్దేశానుష్ఠానా ప్రతికూలో గురుప్రసాద లబ్ధస్వాధ్యాయతత్పరః స్యాత్. 8

ఇందు సరిగా శౌచము సంస్కారము నియమములు, వ్రతములు మొదలగు వానిచేత మనస్సును అదుపున నుంచుకొన్నవాడును, రెండు సంధ్యలయందును సూర్యుడు, అగ్ని, దేవతలు అనువానిని ఉపాసించి, కునుకుపాటు, సోమరితనములను వదలివైచి,గురువునకు అభివాదనము చేయుట, వేదముల నభ్యసించుట, వినుట అనువానిచేత పవిత్రత నందిన అంతరాత్మ కలవాడును, మూడు సమయములలో స్నానముచేయుచు, బ్రహ్మచర్యము, అగ్నిపూజ, గురుశుశ్రూష, నిత్యభిక్ష చేయువాడును, భిక్షావృత్తితో వచ్చిన దానిని సర్వమును గురువునకు/దైవమునకు నివేదించెడు బుద్ధి కలవాడును, గురువుల వాక్యములు నిర్దేశించినదానిని ఆచరించుటలో వ్యతిరేకభావము లేనివాడును, గురువు అనుగ్రహముతో పొందిన వేద విద్యయందు శ్రద్ధ కలవాడును కావలయును.

భవతి చాత్ర శ్లోకః - ఇచట నొక శ్లోకము కలదు.

గురుం యస్తు సమారాధ్య ద్విజో వేద మవాప్నుయాత్,

తస్య స్వర్గఫలావాప్తిః సిధ్యతే చాస్య మానసమ్. – ఇతి 9

గురువును చక్కగా ఆరాధించిన ద్విజుడు వేదమును పొందును. అతనికి స్వర్గఫలము లభించును. దానివలన మానససిద్ధిని పొందును.

గార్హస్థ్యం ఖలు ద్వితీయ మాశ్రమం వదన్తి.

గృహస్థ స్థితిని రెండవ ఆశ్రమముగా పలుకుదురు.

తస్య సముదాచార లక్షణం సర్వ మను వ్యాఖ్యాస్యామః.

దాని సముదాచార లక్షణము నంతటిని వరుసగా వ్యాఖ్యానించెదము.

సమావృత్తానాం సదాచారాణాం సహ ధర్మచర్య ఫలార్థినాం గృహా శ్రమో విధీయతే.

గురుకుల విద్యను ముగించుకొని సదాచారము కలవారై సహధర్మ చర్య ఫలమును కోరువారికి గృహాశ్రమమును శాస్త్రము విధించినది.

ధర్మార్థ కామావాప్తి ర్హ్యత్ర త్రివర్గ సాధన మపేక్ష్య అగర్హితేన కర్మణా ధనాన్యాదాయ స్వాధ్యాయోపలబ్ధప్రకర్షేణ వా బ్రహ్మర్షినిర్మితేన వా అద్రిసారగతేన వా, హవ్యకవ్య నియమాభ్యాస దైవత ప్రసాదోపలబ్ధేన వా ధనేన గృహస్థో గార్హస్థ్యం వర్తయేత్.

ధర్మము, అర్థము, కామము అనువానిని పొందుట యెందు గలదో అది గార్హస్థ్యము. మూడింటి వర్గమునకు సాధనమును కోరి ఎవ్వరు నిందింపని కర్మముతో ధనములను గ్రహించి దీనిని నిర్వహింపవలయును. వేదాధ్యయనము చేయుటచేత లభించిన మహిమచేతనో, బ్రహ్మర్షులు నిర్మించిన విధానము చేతనో, మణులు, దివ్యౌషధములు మొదలగువానిచేతనో, హవ్యము, కవ్యము, నియమము, అభ్యాసము, దేవతా ప్రసాదము మొదలగు వానివలన దొరకిన దానిచేతనో అయిన ధనములతో గృహస్థుడు గృహస్థ ధర్మమును నిర్వహింపవలయును.

తద్ధి సర్వాశ్రమాణాం మూల ముదాహరన్తి.

దానిని తక్కిన ఆశ్రమము లన్నింటికి కుదురుగా చెప్పుదురు.

గురుకుల నివాసినః పరివ్రాజకా యే చాన్యే సంకల్పితవ్రత నియమ

ధర్మానుష్ఠాయిన స్తేషా మప్యత ఏవ భిక్షాబలి సంవిభాగాః ప్రవర్తన్తే. 10

గురుకులములందు నివసించెడు బ్రహ్మచారులు, పరివ్రాజకులు, ఇంకను మరియు సంకల్పించిన వ్రతనియమ ధర్మములను అనుష్ఠించువారును ఎవరెవరు కలరో వారికి ఈగృహస్థుని నుండియే భిక్షలో బలిలో భాగములు ఏర్పడుచున్నవి.

వానప్రస్థానాం చ ద్రవ్యోపస్కార ఇతి ప్రాయశః ఖల్వేతే సాధవః

సాధు పథ్యౌదనాః స్వాధ్యాయ ప్రసఙ్గిన స్తీర్థాభిగమన దేశదర్శనార్థం పృథివీం పర్యటన్తి.

ఇక వానప్రస్థులకు ద్రవ్యము కూడబెట్టుట ఉండరాదు. సాధారణముగా వీరు సాధువులు, మంచిది, పథ్యమైనది అగు ఆహారము కలవారు. స్వాధ్యాయమును గూర్చియే ప్రసంగము కలవారు. తీర్థములను సేవించుకొరకును, ఆయా ప్రదేశములను దర్శించుట కొరకును భూమిపై తిరుగుచుందురు.

తేషాం ప్రత్యుత్థానాభివాదనానసూయ వాక్ర్పదాన సుఖ శక్త్యాసన

సుఖశయనాభ్యవహార సత్ర్కియా చేతి. 11

వారికి లేచి ఎదురేగి అభివాదనము, అసూయలేని మంచి మాటలాడుట, సుఖశక్తితో ఆసనము, మంచిశయనము, భోజనము మొదలగునవి కూర్చి సత్కారము చేయవలయును.

భవతి చాత్ర శ్లోకః

ఇచట నొక శ్లోకము కూడ కలదు.

అతిథి ర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే,

స దత్వా దుష్కృతం తస్మై పుణ్య మాదాయ గచ్చతి. 12

ఎవని యింటనుండి అతిథి ఆశాభంగము పొంది మరలిపోవునో అతని కతడు పాపము నొసగి అతని పుణ్యమును గైకొని పోవును.

అపి చాత్ర యజ్ఞ క్రియాదిభి ర్దేవతాః ప్రీయన్తే నివాపేన పితరో విద్యాభ్యాస

శ్రవణధారణేన ఋషయః అపత్యోత్పాదనేన ప్రజాపతి రితి. 13

మరియు నిందు (గృహస్థ ధర్మము నందు) యజ్ఞ క్రియ మొదలగువాని చేత ఋషులు, పితృతర్పణముచేత పితృదేవతలు, విద్యాభ్యాసము, శ్రవణము, ధారణములచేత ఋషులు, సంతానమును పొందుటచేత ప్రజాపతియు ప్రీతు లగుదురు.

శ్లోకౌ చాత్ర భవతః

ఇందు రెండు శ్లోకములు కలవు.

వాత్సల్యా త్సర్వభూతేభ్యో వాచ్యాః శ్రోత్రసుఖా గిరః,

పరితాపోపఘాతశ్చ పారుష్యం చాత్ర గర్హితమ్. 14

సర్వభూతముల యెడలను వాత్సల్యభావమువలన చెవికింపైన పలుకులను పలుకవలయును. బాధించుట, పీడించుట, పరుషముగా నుండుట అనునవి ఇందు దోషము.

అవజ్ఞాన మహంకారో దంభశ్చైవ విగర్హితః,

అహింసా సత్య మక్రోధః సర్వాశ్రమగతం తపః . 15

అవమానించుట, అహంకరించుట, దంభము ఇందు నిందితములు. అహింస, సత్యము, క్రోధము లేకుండుట అనునది అన్ని ఆశ్రమములకు చెందిన తపస్సు.

అపి చాత్ర మాల్యాభరణ వస్త్రాభ్యంగ నిత్యోపభోగ నృత్యగీత వాదిత్ర

శ్రుతిసుఖ నయనాభి రామదర్శనానాం ప్రాప్తి ర్భక్ష్య భోజ్య లేహ్య

పేయచోష్యాణా మభ్యవహార్యాణాం వివిధానా ముపభోగః స్వ విహార

సంతోషః కామసుఖా వాప్తి రితి. 16

మరియు నిందు మాల్యములు, ఆభరణములు, వస్త్రములు, తలంటు స్నానము, నిత్య భోగములు, నృత్యము, గీతములు, వాద్యములు, చెవికింపైన, కనుటకు మనోహరమైన వాని దర్శనములు లభించుటయు, భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, పేయములు, చోష్యము అను పెక్కింటి భోజన పదార్థముల ఉపభోగము, తమ విహారములకు సంబంధించిన సంతోషము, కామ సుఖము లభించుట అనునవి కలుగును.

త్రి వర్గగుణ నిర్వృత్తి ర్యస్య నిత్యం గృహాశ్రమే,

స సుఖాన్యనుభూయేహ శిష్టానాం గతి మాప్నుయాత్. 17

మూడింటి సముదాయముతో కూడి గుణములు కృతార్థతయు గృహస్థాశ్రమమున ఎవనికి సర్వకాలములందును కలుగునో అతడు ఇచట సుఖము లన్నింటి ననుభవించి పిదప శిష్టులగతిని పొందును.

ఉఞ్ఛ వృత్తి ర్గృహస్థా యః స్వధర్మాచరణే రతః,

త్యక్త కామ సుఖారంభః స్వర్గ స్తస్య న దుర్లభః . 18

ఇతి శ్రీ మహా భారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి
భృగుభరద్వాజ సంవాదే ఏకనవత్యధికశతతమోఽధ్యాయః

గింజలేరుకొని తిను బ్రతుకు తెరువుగల గృహస్థుడు తన ధర్మము నాచరించుటలో ఆసక్తి కలవాడై కామసుఖములకు సంబంధించిన పనులు వదలి వైచినచో అతనికి స్వర్గము దుర్లభము కాదు.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున భృగు
భరద్వాజ సంవాదము గల నూట తొంబది యొకటవ అధ్యాయము.

భృగు రువాచ : భృగు విట్లు పలికెను.

వానప్రస్థాః ఖల్వపి ధర్మమనుసరన్తః పుణ్యాని తీర్థాని నదీ ప్రస్రవణాని సువివిక్తే ష్వరణ్యేషు మృగ మహిష వరాహ శార్దూల వనగజా కీర్లేషు తపస్యన్తోఽను సంచరన్తి. త్యక్త గ్రామ్య వస్త్రా భ్యవహా రోపభోగా వన్యౌషధి ఫలమూల పర్ణ పరిమిత విచిత్ర నియతాహారాః స్థానాసనినో భూమిపాషాణ సికతా శర్కరా వాలుకా భస్మశాయినః, కాశకుశచర్మ వల్కల సంవృతాంగాః కేశశ్మశ్రు నఖ రోమ ధారిణో, నియతకాలోపస్పర్శనా అస్కన్దిత కాలబలి హోమానుష్ఠాయినః సమిత్కుశ కుసుమాపహార సంమార్జన లబ్ధ విశ్రామాః శీతోష్ణ వర్షపవన విష్టంభ విభిన్న సర్వత్వచః వివిధ నియమోపభోగ చర్యానుష్ఠాన విహిత పరిశుష్క మాంసశోణిత త్వగస్థిభూతా ధృతిపరాః సత్త్వయోగా చ్ఛరీరాణ్యుద్వహన్తే. 1

వానప్రస్థులును ధర్మముననుసరించుచు పుణ్యతీర్థములను నదీప్రవాహములను సేవించుచు, పూర్తిగా ఏకాంతము గల అరణ్యములయందు - లేళ్లు, దున్నలు, అడవి పందులు, పెద్దపులులు, అడవి యేనుగులు మొదలగువానితో నిండియున్న అరణ్యములందు - తపస్సు చేసికొనుచు తిరుగుచుందురు. గ్రామములకు చెందిన వస్త్రములను భోజనములను వదలివైచి అడవులలో దొరకెడు తృణలతలు, పండ్లు, ఆకులు మొదలగు వానితో పరిమితము, విచిత్రము, నియతమునగు ఆహారము కలవారై యుందురు. నేలయే ఆసనము, భూమి,రాలు, ఇసుక, గులకరాల నేల, రాలతో నిండిన నేల, బూడిద అను వానియందు పడు కొందురు. రెల్లు, దర్భ, చర్మము, నారబట్టలు అనువానితో దేహమును కప్పుకొందురు. జుట్టు, గడ్డములు, గోళ్లు, రోమములను ధరింతురు. నిర్ణయించిన కాలమందు స్నానములు చేయుచుందురు. హద్దుమీరని కాలమున బలి, హోమము అనువాని ననుష్ఠింతురు. సమిధలు, దర్భలు, పూవులు తెచ్చుట, ఊడ్చుట అనువానిచేత విశ్రాంతిని పొందుదురు. చలి, వేడి, వాన, గాలి అనువానిని విలాసముగా సహించుటచేత పగుళ్లు వారిన చర్మము గలిగియుందురు. పెక్కువిధములగు నియమములతో కూడిన భోజనముల చేతను, అనుష్ఠానముల చేతను బాగుగా ఎండి పోయిన మాంసము, రక్తము, చర్మము, ఎముకలు కలిగియుందురు. ధైర్యమును విడనాడరు. సత్యయోగము వలన శరీరములను నిలుపుకొని యుందురు.

యస్త్వేతాం నియత శ్చర్యాం బ్రహ్మర్షి విహితాం చరేత్,

స దహేదగ్నివ ద్దోషాన్ జయే ల్లోకాంశ్చ దుర్జయాన్. 2

నియమము తప్పక, బ్రహ్మర్షులు ఏర్పరచిన ఈ వానప్రస్థచర్యను ఆచరించు వాడు, అగ్నివలె, అన్ని దోషములను కాల్చివేయును, గెలువనలవి కాని లోకములను కూడ గెలుచును.

పరివ్రాజకానాం పునరాచారః తద్యథా విముచ్యాగ్ని ధన కలత్ర

పరిబర్హణం సంగేష్వాత్మనః స్నేహపాశా నవధూయ పరివ్రజన్తి.

ఇక పరివ్రాజకుల ఆచారము ఎట్టిదనగా వారు అగ్ని, ధనము, భార్య, శయ్యమొదలగు భోగ సామగ్రి అనువానిని వదలివైచి తగులముల యందు తనకున్న స్నేహ పాశమును త్రెంచి వైచుకొని తిరుగుచుందురు.

సమలోష్ఠాశ్మకాంచనా స్త్రి వర్గ ప్రవృత్తే ష్వసక్తబుద్ధయోఽ రిమిత్రోదాసీనానాం తుల్యదర్శనాః స్థావర జరాయుజాండజ స్వేదజోద్భిజ్జానాం భూతానాం వాఙ్మనః కర్మభి రనభిద్రోహిణోఽ నికేతాః పర్వత పులిన వృక్షమూల దేవతాయతనా న్యను చరన్తో వాసార్థ ముపేయు ర్నగరం గ్రామం వా నగరే పఞ్చరాత్రికాః గ్రామే చైకరాత్రికాః ప్రవిశ్య చ ప్రాణ ధారణార్థం ద్విజాతీనాం భవనా న్యసంకీర్ణ కర్మణా ముపతిష్ఠేయుః పాత్రపతితాయాచిత భైక్ష్క్ష్యాః కామక్రోధ దర్పలోభ మోహ కార్పణ్యదంభ పరివాదాభిమాన హింసానివృత్తా ఇతి. 3

మట్టి బెడ్డ, రాయి, బంగారము అనువానియందు ఒకే విధమగు భావన కలవారు, ధర్మార్థ కామముల ప్రవృత్తులయందు తగులము లేని బుద్ధి కలవారు, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అనువారిని ఒకే విధముగా చూడగలవారు, స్థావరములు, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్జములు అను ప్రాణులకు మాటతో గాని మనసుతో గాని చేష్టతో గాని ద్రోహము చేయనివారు, ఇల్లు లేని వారు, కొండలు, ఇసుకతిప్పలు, చెట్లమొదళ్లు, దేవాలయములు, అనువాని యందు తిరుగుచుండువారు, ఎప్పుడైన ఉండుటకై నగరమునో గ్రామమునో చేరినను నగరమునందు అయిదు రాత్రుల కాలము, గ్రామమునందు ఒక్క రాత్రి కాలము అను నియమముతో ప్రాణధారణకై, సంకరము పొందని కర్మములు గల ద్విజుల యిండ్లయందు, పాత్రలోపడిన, అడుగుకొనని భిక్షాపదార్థమును మాత్రము భుజించువారు, కామము, క్రోధము, లోభము, మోహము, దీనత, పొగరు, నిందించుట, అభిమానము, హింస అనువానిని విడచివైచినవారు. (పరివ్రాజకులు). భవన్తి చాత్ర శ్లోకాః

ఇచట కొన్ని శ్లోకములు కలవు.

అభయం సర్వభూతేభ్యో దత్వా యశ్చరతే మునిః,

న తస్య సర్వభూతేభ్యో భయ ముత్పద్యతే క్వచిత్. 4

మునియై సర్వభూతములకు అభయమొసగి ప్రవర్తించుమనుజునకు సర్వభూతములవలనను ఎందును భయము కలుగదు.

కృత్వాగ్ని హోత్రం స్వశరీర సంస్థం

శారీర మగ్నిం స్వముఖే జుహోతి,

విప్రస్తు భైక్ష్యోపగతై ర్హవిర్భి

శ్చితాగ్నినాం సవ్రజతే హి లోకమ్. 5

తన శరీరమందున్న అగ్నిని ఏర్పరచుకొని శరీరమునందలి అగ్నిని భిక్షవలన వచ్చిన హవిస్సులతో తన ముఖమున వ్రేల్చుకొనువాడు చితాగ్నుల లోకములను పొందును.

మోక్షాశ్రమం యశ్చరతే యథోక్తం

శుచిః సుసంకల్పిత ముక్తబుద్ధిః,

అనిన్దనం జ్యోతి రివ ప్రశాన్తం

స బ్రహ్మలోకం శ్రయతే మనుష్యః . 6

శాస్త్రము చెప్పిన విధముగా శుచియై చక్కగా వదలివైచిన సంకల్పముగల బుద్ధి కలవాడై మోక్షాశ్రమధర్మము నాచరించువాడు ఇంధనములేని జ్యోతివలె ప్రశాంతమగు బ్రహ్మలోకమును చేరుకొనును.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

అస్మాల్లోకాత్పరో లోకః శ్రూయతే నోపలభ్యతే,

తమహం జ్ఞాతు మిచ్ఛామి తద్భవాన్ వక్తు మర్హతి. 7

ఈ లోకముకంటె వేరైన లోక మొకటి వినవచ్చుచున్నది. కాని దొరకుటలేదు. దానిని నేను తెలిసికొనగోరుచున్నాను. దానిని తమరు నాకు చెప్పవలయును.

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

ఉత్తరే హిమవత్పార్శ్వే పుణ్యే సర్వగుణాన్వితే,

పుణ్యః క్షేమ్యశ్చ కామ్యశ్చ సపరో లోక ఉచ్యతే. 8

ఉత్తరదిక్కునందు హిమవత్పర్వతము పార్శ్వమున సర్వగుణములతో కూడినది అగుచోట పుణ్యము, క్షేమముతో కూడినది, అందరకు కోరదగినది యగు స్వర్గమే పరలోకమని చెప్పబడును.

తత్ర హ్యపాపకర్మాణః శుచయోఽ త్యన్త నిర్మలాః, 9

లోభమోహ పరిత్యక్తా మానవా ననిరుపద్రవాః .

అందు పాపకర్మములు లేనివారు, పవిత్రులు, మిక్కిలి నిర్మలతకలవారు, లోభమోహములను వదలివైచిన వారు నగు మానవులు ఏ ఉపద్రవములు లేక ఉందురు.

స స్వర్గ సదృశో దేశ స్తత్ర హ్యుక్తాః శుభా గుణాః,

కాలే మృత్యుః ప్రభవతి స్పృశన్తి వ్యాధయో న చ . 10

స్వర్గమునకు సాటి వచ్చునది ఆదేశము. అందు మంచి గుణములన్నియు నుండును. కాలమున అమృత్యువు వచ్చును. రోగములు మనుజులను తాకవు.

న లోభః పరదారేషు స్వదారనిరతో జనః,

నాన్యోన్యం బధ్యతే తత్ర ద్రవ్యేషు చ న విస్మయః,

పరో హ్యధర్మో నైవాస్తి సందేహో నాపి జాయతే. 11

పరుల భార్యలయందు లోభము లేదు. అజనుడై తన భార్యయందు ప్రీతి కలిగియుండును. అందొకరి కొకరు అందు చిక్కువడరు. పరమైన అధర్మము లేనేలేదు. సందేహము కూడ కలుగదు.

కృతస్య తు ఫలం తత్ర ప్రత్యక్ష ముపలభ్యతే,

పానాసనాశనోపేతాః ప్రాసాద భవనాశ్రయాః. 12

చేసినదాని ఫలము అందు ప్రత్యక్షముగా చేతికందును. పానము, ఆసనము, భోజనములతో కూడినవారును, ప్రాసాదభవనములు చేరుకొన్నవారును అగుదురు.

సర్వకామై ర్వృతాః కేచి ద్ధేమాభరణ భూషితాః,

ప్రాణధారణ మాత్రం తు కేషాంచి దుపపద్యతే . 13

శ్రమేణ మహతా కేచి త్కుర్వన్తి ప్రాణధారణమ్,

ఇహధర్మపరాః కేచిత్ కేచిన్నైకృతికా నరాః,

సుఖితా దుఃఖితాః కేచి న్నిర్ధనా ధనినోఽపరే . 14

ఇందు కొందరు యోగులు సర్వకామములతో చుట్టుకొనబడి హేమాభరణ భూషితులై యుందురు. కొందరికి ప్రాణమునందు ధారణము లభించును. మరికొందరు గొప్ప శ్రమతో ప్రాణధారణము చేయుదురు. కొందరు ధర్మపరులు, కొందరు ఆత్మవంచనపరులు. కొందరు సుఖము కలవారు, మరికొందరు దుఃఖితులు - కొందరు ధనహీనులు, ఇతరులు ధనవంతులు.

ఇహ శ్రమో భయం మోహః క్షుధా తీవ్రా చ జాయతే,

లోభశ్చార్థకృతో నౄణాం యేన ముహ్యన్త్యపణ్డితాః . 15

ఇందు శ్రమ, భయము, మోహము, తీవ్రమగు ఆకలి కలుగును. అర్థ సంబంధముగా నరులకు లోభము కలుగును. దానితో పండితులును మోహపడుదురు.

ఇహ వార్తా బహువిధా ధర్మాధర్మస్య కారిణః,

యస్తద్వేదోభయం ప్రాజ్ఞః పాప్మనా న స లిప్యతే. 16

ఇచట కుశలులు పెక్కు వాదముల వారు, ధర్మాధర్మములను చేయుచుందురు. ఈ ధర్మాధర్మములను రెంటిని తెలిసిన వాడు ప్రజ్ఞావంతుడు. అతనికి పాపమంటదు.

సోపధం నికృతి స్తేయం పరీవాదో హ్యసూయితా,

పరోపఘాతో హింసాచ పైశున్య మనృతం తథా . 17

ఏతా నాసేవతే యస్తు తప స్తస్య ప్రహీయతే,

యస్త్వేతా న్నాచరే ద్విద్వాం స్తప స్తస్య ప్రవర్ధతే . 18

ఆర్భాటము, అపకారము, దొంగతనము, నింద, అసూయపడుట, ఇతరులను పీడించుట, హింస, పిసినిగొట్టుతనము, అనృతము - వీనిని సేవించువాని తపస్సు మిక్కిలిగా తరిగిపోవును. వీనిని చేయని విద్వాంసుని తపస్సు వృద్ధి పొందును.

ఇహచిన్తా బహువిధా ధర్మాధర్మస్య కర్మణః,

కర్మభూమి రియం లోకా ఇహ కృత్వా శుభాశుభమ్,

శుభైః శుభ మవాప్నోతి తథా శుభ మథాన్యధా . 19

ధర్మాధర్మకర్మమునకు సంబంధించిన విచారణను ఇచట పలువిధములుగా చేయవలయును. ఇది కర్మభూమి. ఈలోకమున శుభము, అశుభము అను కర్మమును చేసి శుభ కర్మములతో శుభమును, అశుభ కర్మముతో అశుభమును పొందును.

ఇహ ప్రజాపతిః పూర్వం దేవాః సర్షిగణా స్తథా,

ఇష్ట్వేష్టతపసః పూతా బ్రహ్మలోక ముపాశ్రితాః . 20

ఇచట మునుపు ప్రజాపతియు, ఋషుల గణములతో కూడిన దేవతలును ఇష్టమైన తపస్సు నాచరించి పవిత్రులై బ్రహ్మలోకమునకు చేరుకొనిరి.

ఉత్తరః పృథివీభాగః సర్వపుణ్యతమః శుభః,

ఇహస్థా స్తత్ర జాయన్తో యేవై పుణ్యకృతో జనాః. 21

ఉత్తరమైన భూమిభాగము అన్నింటికంటె మిక్కిలి పుణ్యము కలది. శుభ మైనది. ఈలోకము నందలి పుణ్యములు చేసిన జనులు అందు పుట్టుదురు.

యది సత్కార మృచ్ఛన్తి తిర్యగ్యోనిషు చాపరే,

క్షీణాయుష స్తథా చాన్యే నశ్యన్తి పృథివీతలే. 22

కోరినచో యోగమున ఆదరమును పొందుదురు. ఇతరులు పశుపక్ష్యాదుల కడుపులలో పుట్టుదురు. ఆయువు తరిగి పోయిన వారై పృథివీతలమున నశింతురు.

అన్యోన్య భక్షణాసక్తా లోభమోహ సమన్వితాః,

ఇహైవ పరివర్తన్తే న తే యాన్త్యుత్తరాం దిశమ్. 23

ఒకరినొకరు మ్రింగుకొనునాసక్తి కలవారై లోభమోహములు పైకొన్నవారై ఇందే తిరుగాడుచుందురు. వారు ఉత్తర దిక్కున కరుగరు.

యే గురూన్ పర్యుపాసన్తో నియతా బ్రహ్మచారిణః,

పన్థానం సర్వలోకానాం విజానన్తి మనీషిణః. 24

నియమములు కలవారై గురువులను చక్కగా ఉపాసించుచు బ్రహ్మచారులైనవారు, బుద్ధిమంతులై సర్వలోకముల మార్గము నెరుగుదురు.

ఇత్యుక్తోఽ యం మయా ధర్మః సంక్షిప్తో బ్రహ్మనిర్మితః,

ధర్మాధర్మౌహి లోకస్య యోవై వేత్తి స బుద్ధిమాన్. 25

వేదము వెల్లడి చేసిన ధర్మమును నీకు సంక్షిప్తముగా చెప్పితిని. లోకమునకు సంబంధించిన ధర్మాధర్మములను తెలిసినవాడు బుద్ధిమంతుడు.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.

ఇత్యుక్తో భృగుణా రాజన్ భరద్వాజః ప్రతాపవాన్,

భృగుం పరమధర్మాత్మా విస్మితః ప్రత్యపూజయత్. 26

ఇట్లు ప్రతాపముగలవాడు, పరమధర్మాత్ముడునగు భరద్వాజుడు భృగు విట్లు చెప్పగా విని విస్మితుడై అతనిని మిక్కిలి గౌరవముతో పూజించెను.

ఏష తే ప్రసవో రాజన్ జగతః సంప్రకీర్తితః,

నిఖిలేన మహాప్రాజ్ఞ కిం భూయః శ్రోతుమిచ్ఛసి. 27

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
భృగు భరద్వాజ సంవాదే ద్వినవత్యధికశత తమోఽధ్యాయః

రాజా! ఇది జగత్తు పుట్టుక అని మొత్తముగా ఉన్నదంతయు నీకు చెప్పితిని. మహాప్రాజ్ఞా! ఇంకను ఏమి వినగోరెదవు?

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున
భృగుభరద్వాజ సంవాదము గల నూటతొంబది రెండవ అధ్యాయము.

సంక్షిప్తముగా వెనుక చెప్పిన ఆచారమును యోగమును విస్తరించి ప్రతిపాదించుటకై మూడు అధ్యాయముల భాగమును ప్రారంభించుచున్నారు.

యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.

ఆచారస్య విధిం తాత ప్రోచ్యమానం త్వయాఽ నఘ,

శ్రోతు మిచ్ఛామి ధర్మజ్ఞ సర్వజ్ఞో హ్యసి మే మతః. 1

తాతా! ధర్మజ్ఞా! నీవు సర్వజ్ఞుడవని నా అభిప్రాయము. ఆచారవిధిని గూర్చి నీవు చెప్పుచుండగా వినగోరెదను.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

దురాచారా దుర్విచేష్టా దుష్ప్రజ్ఞాః ప్రియసాహసాః,

అసన్త స్త్వితి విఖ్యాతాః సన్త శ్చాచార లక్షణాః. 2

చెడు ఆచారములు, పాడుచేష్టలు, పాపపు తెలివితేటలు, తొందరపాటుతనము పై ప్రీతి గలవారు అసత్పురుషులని పేరుగాంచెదరు. సత్పురుషులనగా ఆచార లక్షణము కలవారు.

పురీషం యది వా మూత్రం యే న కుర్వన్తి మానవాః,

రాజమార్గే గవాం మధ్యే ధాన్యమధ్యే చ తే శుభాః . 3

రాజమార్గమునందును, గోవులనడుమను, ధాన్యమున్నచోటునను మలమూత్రములను వదలని మానవులు మంచివారు.

శౌచ మావశ్యకం కృత్వా దేవతానాం చ తర్పణమ్,

ధర్మ మాహు ర్మనుష్యాణా ముపస్పృశ్య నదీం తరేత్. 4

శుచికర్మము నాచరించి ఆచమనము చేసి నదియందు స్నానము చేయ వలయును. అటుపై దేవతలకు తర్పణము చేయవలయును. ఇది మనుష్యులకు ధర్మమని చెప్పుదురు.

సూర్యం సదోపతిష్ఠేత న చ సూర్యోదయే స్వపేత్,

సాయంప్రాత ర్జపే త్సంధ్యాం తిష్ఠన్ పూర్వాం తథేతరామ్ . 5

ఎల్లవేళల సూర్యుని ఆరాధింపవలయును. సూర్యోదయకాలమునందు నిద్రింపరాదు. సాయంకాలమునందు, పడమర వైపునకును, ఉదయకాలమునందు తూర్పునకును మొగము పెట్టి సంధ్యను జపింపవలయును.

పఞ్చార్ద్రో భోజనం భుంజ్యాత్ ప్రాఙ్ముఖో మౌన మాస్థితః,

న నిన్ద్య దన్నభక్ష్యాంశ్చ స్వాదు స్వాదు చ భక్షయేత్ . 6

తడిగా అయిదు అవయవములుండునట్లుగా, తూర్పునకు మొగముపెట్టి మౌనమును పాటించుచు భోజనము చేయవలయును. అన్నములను, భక్ష్యములను నిందింపరాదు. రుచిగానుండు వానిని తినవలయును.

ఆర్ద్రపాణిః సముత్తిష్ఠే న్నార్ద్రపాదః స్వపే న్నిశి,

దేవర్షి ర్నారదః ప్రాహ ఏత దాచారలక్షణమ్. 7

తడిచేతులతో లేవవలయును. రాత్రియందు తడికాళ్లతో నిద్రింపరాదు. ఇది ఆచారలక్షణమని దేవర్షి నారదుడు చెప్పెను.

శుచిం దేశ మనడ్వాహం దేవగోష్ఠం చతుష్పథమ్,

బ్రాహ్మణం ధార్మికం చైత్యం నిత్యం కుర్యాత్ప్రదక్షిణమ్ . 8

పవిత్రమగు దేశమును, ఎద్దును, దేహప్రతిమను నాలుగువీధుల కూడలిని, ధార్మికుడైన బ్రాహ్మణుని, చైత్యమును ప్రదక్షిణము చేయవలయును.

అతిథీనాం చ సర్వేషాం ప్రేష్యాణాం స్వజనస్య చ

సామాన్యం భోజనం భృత్యైః పురుషస్య ప్రశస్యతే . 9

అతిథులందరకును, సేవకులకును, తనవారికిని, తనపై ఆధారపడి బ్రదుకు వారికిని సమానమగు భోజనము పెట్టుట మనుజునకు ప్రశస్తము.

సాయం ప్రాత ర్మనుష్యాణా మశనం వేదనిర్మితమ్,

నాన్తరా భోజనం దృష్ట ముపవాసీ తథా భవేత్. 10

ఉదయ సాయంకాలములందు మనుష్యులకు భోజనము వేదము చెప్పినట్టిది. నడుమ నడుమ తినుట శాస్త్రము అంగీకరించినది కాదు. ఈ విధముగా భోజనము చేయువాడు ఉపవాసము చేసినవాడే యగును.

హోమకాలే తథా జుహ్వన్నృతు కాలే తథా వ్రజన్,

అనన్యస్త్రీజనః ప్రాజ్ఞో బ్రహ్మచారీ తథా భవేత్. 11

హోమకాలమున హోమము చేయుచు ఋతుకాలమున భార్యను పొందుచు, అన్యస్త్రీలను భావింపకుండువాడు బ్రహ్మచారి యగును.

అమృతం బ్రాహ్మణోచ్ఛిష్టం జనన్యా హృదయం కృతమ్,

తజ్జనాః పర్యుపాసన్తే సత్యం సన్తః సమాసతే. 12

బ్రాహ్మణులు తినగా మిగిలినది తల్లి హృదయమువలె అమృతము వంటిదిగా బ్రహ్మ ఏర్పరచెను. దానిని ఆ విధముగా ఉపాసించు జనులు సత్పురుషులు బ్రహ్మమునే చేరుకొందురు.

లోష్ఠమర్దీ తృణచ్ఛేదీ నఖఖాదీ తు యో నరః,

నిత్యోచ్ఛిష్టః సంకుసుకో నేహాయు ర్విన్దతే మహత్. 13

మట్టి పిసుకువాడు, దర్భలను త్రుంచువాడు, గోళ్లుకొరుకువాడు, నిత్యము ఉచ్ఛిష్టమును తినువాడు సంకుసుకుడై పెద్దకాలము ఆయువును పొందడు.

యజుషా సంస్కృతం మాంసం నివృత్తో మాంసభక్షణాత్,

నభక్షయే ద్వృథామాంసం పృష్ఠమాంసం చ వర్జయేత్ . 14

యజ్ఞమునందు సంస్కారము పొందిన మాంసమునైనను యజుర్వేదవేత్త తినరాదు. సంస్కారమును పొందని మాంసమును, శ్రాద్ధశేషమైన మాంసమును వదలవలయును.

స్వదేశే పరదేశే వా అతిథిం నోపవాసయేత్,

కామ్య కర్మ ఫలం లబ్ధ్వా గురూణా ముపపాదయేత్ . 15

స్వదేశమున గాని పరదేశమున గాని అతిథిని ఉపవసింప జేయరాదు. కామ్యకర్మము ఫలముగా పొందిన అన్నమును గురువులకు నివేదింపవలయును.

గురుభ్య ఆసనం దేయం కర్తవ్యం చాభివాదనమ్,

గురూ నభ్యర్చ్య యుజ్యన్తే ఆయుషా యశసా శ్రియా . 16

గురువులకు ఆసనమొసగవలయును. అభివాదనము చేయవలయును. గురువులను చక్కగా పూజించి మానవులు ఆయువుతో, కీర్తితో, సంపదతో కూడిన వారగుదురు.

నేక్షేతాదిత్య ముద్యన్తం న చ నగ్నాం పరస్త్రియమ్,

మైథునం సతతం ధర్మ్యం గుహ్యే చైవ సమాచరేత్ . 17

ఉదయించుచున్న సూర్యుని చూడరాదు. బట్టలు లేని పరస్త్రీని చూడరాదు. ధర్మము తప్పని భార్యసంగమమును రహస్యమున ఆచరింపవలయును.

తీర్థానాం హృదయం తీర్థం శుచీనాం హృదయం శుచిః,

సర్వ మార్య కృతం చౌక్ష్యం వాలసంస్పర్శనాని చ . 18

తీర్థముల రహస్యము గురువు. పవిత్రుల హృదయము అగ్ని. ఆర్యులు చేసిన మంచి పనులన్నియు ప్రశంసింప దగినవి. ఆవుల తోకను స్పృశించుట మొదలగునవి చేయదగిన పనులు.

దర్శనే దర్శనే నిత్యం సుఖ ప్రశ్న ముదాహరేత్,

సాయంప్రాత శ్చ విప్రాణాం ప్రదిష్ట మభివాదనమ్ . 19

పెద్దలను, గురువులను చూచినపుడెల్ల సుఖము నడుగుచుండవలెను. ఉదయ సాయంసమయములలో విద్యావంతులకు అభివాదనము శాస్త్రము చెప్పుచున్నది.

దేవాగారే గవాం మధ్యే బ్రాహ్మణానాం క్రియాపథే,

స్వాధ్యాయే భోజనే చైవ దక్షిణం పాణి ముద్ధరేత్. 20

దేవాలయమునందును, గోవులనడుమను, బ్రాహ్మణులు చేయు శ్రౌతస్మార్త కర్మముల అనుష్ఠానమునందును, వేదము నభ్యసించునపుడును, భోజన సమయము నందును కుడిచేతి నెత్తవలయును. (యజ్ఞోపవీతమును కుడిచేతి క్రిందికి ధరింపవలయును. దీనినే 'ఉపవీతి' గా నుండుట యందురు.)

సాయంప్రాతశ్చ విప్రాణాం పూజనం చ యథావిధి,

పుణ్యానాం శోభతే పుణ్యం కృషీణాం బాద్యతే కృషిః,

బహుకారం చ సస్యానాం వాహ్యేవాహో గవాం తథా . 21

ఉదయసాయంకాలములందు శాస్త్రవిధి ననుసరించి విప్రుల పూజనము చేయవలయును. అది పుణ్యముల కెల్ల పుణ్యమై శోభిల్లును. కృషులలో కృషియై స్థిరముగా నిలుచును. పంటలను అధికముగా చేయును. గోవులను పొందవలసిన చోటిని పొందించునది అగును.

సంపన్నం భోజనే నిత్యం పానీయే తర్పణం తథా,

సుశ్రుతం పాయసే బ్రూయా ద్యవాగ్వాం కృసరే తథా. 22

భోజనసమయమున ‘సంపన్నమా’ అనియు, నీరొసగినపుడు 'తర్పణమా' అనియు, పాయసవిషయమునను, గంజి, కృసరమునందును 'శ్రుతమా' అనియు ఆడుగవలయును.

శ్మశ్రు కర్మణి సంప్రాప్తే క్షుతే స్నానేఽథ భోజనే,

వ్యాధితానాం చ సర్వేషా మాయుష్య మభినన్దనమ్. 23

క్షురకర్మము చేసికొనినపుడును, తుమ్మినపుడు, స్నానము, భోజనము చేసినపుడును విప్రుల కభివందనము చేయవలయును. అది వ్యాధులు పొందిన వారికందరకును ఆయువును పెంచునది అగును.

ప్రత్యాదిత్యం న మేహేత న పశ్యేదాత్మనః శకృత్,

సహ స్త్రియాఽథ శయనం సహ భోజ్యం చ వర్జయేత్. 24

సూర్యునివైపునకు తిరిగి మూత్రము చేయరాదు. తాను విసర్జించిన మలమును చూడరాదు. స్త్రీతో శయనము, భోజనము చేయుటను వదలవలయును.

త్వంకారం నామధేయం చ జ్యేష్ఠానాం పరివర్జయేత్,

అవరాణాం సమానానా ముభయేషాం న దుష్యతి . 25

'నీవు' అనుట, పేరుపెట్టి వ్యవహరించుట పెద్దవారి విషయమున వదలవలయును. చిన్నవారి, సమానుల విషయమున ఇట్టి వ్యవహారము తప్పుకాదు.

హృదయం పాపవృత్తానాం పాపమాఖ్యాతి వైకృతమ్,

జ్ఞానపూర్వం వినశ్యన్తి గూహమానా మహాజనే . 26

పాపపు నడవడి గలవారి పాపమును వారి హృదయ వికారమే తెలియజేయును. మహాజనులకడ వారు పాపమును దాచుకొన్నను అది అందరకు ఎరుకపడగా నశింతురు.

జ్ఞానపూర్వకృతం పాపం ఛాదయత్యబహుశ్రుతః,

నైనం మనుష్యాః పశ్యన్తి పశ్యన్త్యేవ దివౌకసః . 27

తెలిసి తెలిసి చేసిన పాపమును, చక్కని చదువు లేనివాడు కప్పుకొనును. దానిని ఇతరమనుజులు తెలియకున్నను దేవతలు దానిని చూచెదరు.

పాపేనాపిహితం పాపం పాప మేవానువర్తతే,

ధర్మేణాపిహితో ధర్మో ధర్మ మేవానువర్తతే,

ధార్మికేణ కృతో ధర్మో ధర్మ మేవానువర్తతే . 28

పాపము కప్పిన పాపిని పాపమే వెంటనంటును. ధర్మముతో కప్పిన ధర్మమునే అనుసరించును. ధార్మికుడు చేసిన ధర్మము ధర్మమునే అనుసరించును.

పాపం కృతం న స్మరతీహ మూఢో

నివర్తమానస్య తదేతి కర్తుః,

రాహు ర్యథా చన్ద్ర ముపైతి చాపి

తథాఽ బుధం పాప ముపైతి కర్మ. 29

మూఢుడు చేసిన పాపమును స్మరింపడు. శాస్త్ర విరుద్ధముగా నడచు కర్తనే అది వచ్చి చేరుకొనును. రాహువు చంద్రుని చేరు విధముగా, వివేకములేని వానిని పాపకర్మము చేరుకొనును.

ఆశయా సఞ్చితం ద్రవ్యం దుఃఖం నైవోపభుజ్యతే,

తద్బుధా న ప్రశంసన్తి మరణం న ప్రతీక్షతే. 30

ఆశతో కూడబెట్టిన సొమ్ము దుఃఖమే. అది అనుభవమునకు రాదు. దానిని వివేకము కలవారు మెచ్చుకొనరు. మరణము వేచిచూడదు.

మానసం సర్వభూతానాం ధర్మ మాహు ర్మనీషిణః,

తస్మాత్సర్వేషు భూతేషు మనసా శివమాచరేత్ . 31

సర్వప్రాణులకును మానసధర్మమే ఉత్తమమని వివేకము కలవారు చెప్పుదురు. అందువలన సర్వభూతముల విషయమునను మనస్సుతో శుభమునే చేయ వలయును.

ఏక ఏవ చరేద్ధర్మం నాస్తి ధర్మే సహాయతా,

కేవలం విధి మాసాద్య సహాయః కిం కరిష్యతి . 32

తానొక్కడే ధర్మమునాచరింపవలయును. ధర్మవిషయమున తోడు అనునది లేదు. కేవలము ధర్మమును సాధించినచో సహాయ మేమి చేయును?

ధర్మో యోని ర్మనుష్యాణాం దేవానా మమృతం దివి

ప్రేత్యభావే సుఖం ధర్మా చ్ఛశ్వత్తై రుపభుజ్యతే. 33

ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మ పర్వణి
భీష్మయుధిష్ఠిర సంవాదే ఆచారవిధౌ త్రినవత్యధిక శతతమోఽధ్యాయః

మనుష్యులకు ధర్మమే యోని. అది స్వర్గమున దేవతలకు అమృతము. మరణించిన తర్వాత సుఖము ధర్మమువలననే లభించును. నిత్యసుఖమును మానవుడు ధర్మప్రవృత్తులచేత అనుభవించును.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున
భీష్మయుధిష్ఠిర సంవాదమునందు ఆచారవిధిగల
నూటతొంబదిమూడవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లు పలికెను.

అధ్యాత్మం నామ యదిదం పురుషస్యేహ చిన్త్యతే,

యదధ్యాత్మం యథా చైతత్ తన్మే బ్రూహి పితామహ. 1

అధ్యాత్మమని మానవుడు చింతించునది అది యేది? దేనిని అధ్యాత్మ మందురు. దాని తీరుతెన్నులెట్టివి? తాతా! దానిని నాకు చెప్పుము.

కుతః సృష్ట మిదం విశ్వం బ్రహ్మన్ స్థావరజంగమమ్,

ప్రళయే కథ మభ్యేతి తన్మే వక్తు మిహార్హసి. 2

ఓ బ్రహ్మజ్ఞా! ఈ విశ్వమంతయు - స్థావరజంగమాత్మకమైనది - ఎచటినుండి ఏర్పడినది? ప్రళయమున ఎట్లు పోవును? దీనిని నాకు చెప్పవలయును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అధ్యాత్మ మితి మాం పార్థ యదేత దనుపృచ్ఛసి,

తద్వ్యాఖ్యాస్యామి తే తాత శ్రేయస్కరతమం సుఖమ్ . 3

కుంతీకుమారా! ఆధ్యాత్మమను దానినిగూర్చి నీవు అడుగుచున్నదానిని వ్యాఖ్యానించెదను. నాయనా! అది శ్రేయస్సును గూర్చువానిలో అన్నింటికంటె మించిన సుఖము.

సృష్టి ప్రళయసంయుక్త మాచార్యైః పరిదర్శితమ్,

యద్జ్ఞాత్వా పురుషో లోకే ప్రీతిం సౌఖ్యం చ విన్దతి,

ఫలలాభశ్చ తస్య స్యాత్ సర్వభూతహితం చ తత్ . 4

ఇది సృష్టి ప్రళయములతో కూడినదని ఆచార్యులు కనుగొనిరి. దానిని తెలిసికొని పురుషుడు లోకమున ప్రీతిని సౌఖ్యమును పొందును. అతనికి ఫలలాభమును కలుగును. అది సర్వభూతములకు హితమైనది.

పృథివీ వాయు రాకాశ మాపో జ్యోతిశ్చ పఞ్చమమ్,

మహాభూతాని భూతానాం సర్వేషాం ప్రభవాప్యయౌ . 5

భూమి, వాయువు, ఆకాశము, జలములు, అగ్ని అను మహాభూతములు సర్వభూతములకు ఉత్పత్తి లయస్థానములు.

యతః సృష్టాని తత్రైవ తాని యాన్తి పునః పునః,

మహాభూతాని భూతేభ్యః సాగర స్యోర్మయో యథా . 6

దేనినుండి వెలువడినవో వానినే మరల మరల చేరుకొనును. సముద్రముల తరంగముల వలె భూతములనుండి మహాభూతములు వెలువడుచున్నవి. కలిసిపోవుచున్నవి.

ప్రసార్య చ యథాఙ్గాని కూర్మః సంహరతే పునః,

తద్వద్భూతాని భూతాత్మా సృష్టాని హరతే పునః . 7

తాబేలు తన అవయవములను బయటకు వెలువరించి మరల లోనికి తీసికొనునట్లు భూతాత్మ భూతములను సృజించి మరల హరించును.

మహాభూతాని పఞ్చైవ సర్వభూతేషు భూతకృత్,

అకరో త్తేషు వైషమ్యం తత్తు జీవో న పశ్యతి . 8

సర్వభూతములయందును మహాభూతములు అయిదే కలవు. భూతములను సృజించినవాడు వానియందు వైషమ్యమును చేసెను. జీవుడు దానిని చూడకున్నాడు.

శబ్దః శ్రోత్రం తథా ఖాని త్రయ మాకాశ యోనిజమ్,

వాయోః స్పర్శ స్తథా చేష్టా త్వక్చైవ త్రితయం స్మృతమ్. 9

శబ్దము, శ్రోత్రము, అట్లే రంధ్రములు - ఈ మూడును ఆకాశము కారణముగా పుట్టినవి. స్పర్శము, చేష్ట, చర్మము అను మూడును వాయువునుండి ఏర్పడినవి.

రూపం చక్షు స్తథా పాక స్త్రివిధం తేజ ఉచ్యతే,

రసః క్లేదశ్చ జిహ్వాచ త్రయో జలగుణాః స్మృతాః . 10

రూపము, కన్ను, పాకము అను మూడువిధములు కలది తేజము (అగ్ని). రసము, ద్రవము, నాలుక అను మూడును నీటి గుణములు.

ఘ్రేయం ఘ్రాణం శరీరం చ ఏతే భూమిగుణాః స్మృతాః,

మహాభూతాని పఞ్చైవ షష్ఠం చ మన ఉచ్యతే . 11

వాసన, ముక్కు, శరీరము ఈ మూడును భూమి గుణములు. మహాభూతములు అయిదే. ఆరవది మనస్సు అని చెప్పుదురు.

ఇన్ద్రియాణి మనశ్చైవ విజ్ఞానాన్యస్య భారత,

సప్తమీ బుద్ధి రిత్యాహుః క్షేత్రజ్ఞః పున రష్టమః . 12

ఇంద్రియములు మనస్సును అతని విజ్ఞానములు. ఏడవది బుద్ధి. క్షేత్రజ్ఞుడు ఎనిమిదవవాడు.

చక్షురాలోచనా యైవ సంశయం కురుతే మనః,

బుద్ధి రధ్యవసానాయ క్షేత్రజ్ఞః సాక్షివత్ స్థితః . 13

కన్ను మొదలగునవి ఆలోచనకొరకు అయినవి. మనస్సు సంశయమును కలుగజేయును. బుద్ధి నిశ్చయముకొరకు అయినది. క్షేత్రజ్ఞుడు సాక్షివలె నిలిచియుండును.

ఊర్ధ్వం పాదతలాభ్యాం యదర్వా క్చోర్ధ్వంచ పశ్యతి,

ఏతేన సర్వ మేవేదం విద్ధ్యభివ్యాప్త మన్తరమ్ . 14

పాదతలములు మొదలుకొని పైకి వ్యాపించి యున్న శరీరమును పైకి క్రిందికి వ్యాపించియున్న చైతన్యము అను సాక్షి చూచుచున్నది. దీనిచేత ఇది యంతయు లోపల వ్యాపించియున్నదని తెలియుము.

పురుషై రిన్ద్రియాణీహ వేదితవ్యాని కృత్స్నశః,

తమో రజశ్చ సత్త్వం చ తేఽపి భావా స్తదాశ్రితాః. 15

మనుజులు ఈ ఇంద్రియములను మొత్తముగా తెలియవలయును. తమస్సు, రజస్సు, సత్త్వము అనువాని నాశ్రయించిన భావములను కూడ తెలియవలయును.

ఏతాం బుద్ధ్వా నరో బుద్ధ్యా భూతానా మాగతిం గతిమ్,

సమవేక్ష్య శనై శ్చైవ లభతే శమముత్తమమ్ . 16

నరుడు దీనిని బుద్ధితో తెలిసికొని భూతముల రాకపోకలను చక్కగా గమనించి మెల్లమెల్లగా ఉత్తమమగు శమమును పొందును.

గుణై ర్నేనీయతే బుద్ధి ర్బుద్ధి రేవేన్ద్రియా ణ్యపి,

మనః షష్ఠాని భూతాని తదభావే కుతో గుణాః . 17

బుద్ధి గుణములచేత మిక్కిలిగా రూపొందుచుండును. బుద్ధియే మనస్సు ఆరవదిగా గల ఇంద్రియములు. భూతములు అదియే. బుద్ధి లేనిచో గుణము లెక్కడివి?

ఇతి తన్మయ మేవైత త్సర్వం స్థావరజంగమమ్,

ప్రలీయతే చోద్భవతి తస్మా న్నిర్దిశ్యతే యథా . 18

కావున స్థావరజంగమాత్మకమయిన సర్వము బుద్ధిమయమే. అందే అంతయు అణగుచున్నది. ఏర్పడుచున్నది. దానివలననే కానవచ్చుచున్నది.

యేన పశ్యతి తచ్చక్షుః శృణోతి శ్రోత్ర ముచ్యతే,

జిఘ్రతి ఘ్రాణ మిత్యాహుః రసం జానాతి జిహ్వయా. 19

త్వచా స్పర్శయతే స్పర్శం బుద్ధి ర్విక్రియతే సకృత్,

యేన ప్రార్థయతే కిఞ్చిత్తదా భవతి తన్మయః . 20

ఆ బుద్ధి దేనితో చూచుచున్నదో అది కన్ను. వినుచున్నదో అది చెవి. వాసన చూచుచున్నదో అది ముక్కు. రసము నాలుకతో తెలియుచున్నది. చర్మముతో స్పర్శను ఎరుగుచున్నది. ఇట్లు బుద్ధియే పెక్కుమారులు ఆయా వికారములను పొందుచున్నది. దాని నేది కోరుచుండునో అది తన్మయముగా నగుచుండును.

అధిష్ఠానాని బుద్దేర్హి పృథగర్ణాని పఞ్చధా,

ఇన్ద్రియాణీతి యాన్యాహు స్తాన్యదృశ్యోఽధితిష్ఠతి . 21

బుద్ధికి అధిష్ఠానములు వేరువేరు ప్రయోజనములు గలిగి అయిదుగానైనవి. వానినే యింద్రియములందురు. చిదాత్మ అదృశ్యుడై వాని నధివసించి యుండును.

పురుషే తిష్ఠతీ బుద్ధి స్త్రీషు భావేషు వర్తతే,

కదాచి ల్లభతే ప్రీతిం కదాచి దనుశోచతి . 22

పురుషునియందు నిలిచియున్నదై ఈ బుద్ధి మూడు భావములందు తిరుగుచుండును. ఒకప్పుడు ప్రీతిని పొందును. మరియొక సమయమున శోకము పొందుచుండును.

న సుఖేన న దుఃఖేన కదాచిదపి వర్తతే,

ఏవం నరాణాం మనసి త్రిషు భావే ష్వవస్థితా . 23

ఒకప్పుడు సుఖదుఃఖములు రెండును లేక ప్రవర్తించుచుండును. ఇట్లు నరుల మనస్సునందు బుద్ధి మూడు భావములయందు నెలకొనియుండును.

సేయం భావాత్మికా భావాం స్త్రీ నేతా నతివర్తతే,

సరితాం సాగరో భర్తా మహావేలా మివోర్మివాన్. 24

ఇట్లీ భావాత్మిక అయిన బుద్ది ఈ మూడు భావములను, నదుల భర్త సాగరుడు, పెద్ద అలలతో చెలియలికట్టను వలె, అతిక్రమించును.

అతిభావగతా బుద్ధి ర్భావే మనసి వర్తతే,

ప్రవర్తమానం తు రజ స్తద్భావ మనువర్తతే. 25

భావముల నతిక్రమించిన బుద్ధి భావమునందు మెలగుచుండును. ప్రవర్తమానమగురజస్సు మాత్రము బుద్ధిభావమును వెంటనంటుచుండును.

ఇన్ద్రియాణి హి సర్వాణి ప్రవర్తయతి సా తదా,

తతః సత్త్వం తమోభావః ప్రీతియోగా త్ప్రవర్తతే . 26

అప్పుడా బుద్ధి ఇంద్రియములన్నింటిని ప్రవర్తింపజేయును. అప్పుడు సత్త్వము ఏర్పడును. ప్రీతియోగమువలన తమోభావము ప్రవర్తించును.

ప్రీతిః సత్త్వం రజ శ్శోక స్తమో మోహస్తు తే త్రయః,

యే యే చ భావా లోకేఽ స్మిన్ సర్వేష్వేతేషు వై త్రిషు. 27

సత్త్వము, ప్రీతి, రజస్సుశోకము, తమస్సు మోహము. ఈ మూడును ఈ విధమైనవి. ఈ లోకమునగల ఇట్టి భావములన్నియు ఈ మూడింటియందే రూపొందును.

ఇతి బుద్ధిగతిః సర్వా వ్యాఖ్యాతా తవ భారత,

ఇన్ద్రియాణి చ సర్వాణి విజేతవ్యాని ధీమతా . 28

భారతా! ఇదిగో నీకు సర్వమైన బుద్ధిగతిని వివరించి చెప్పితిని. బుద్ధిమంతుడు ఇంద్రియముల నన్నింటిని గెలువవలయును.

సత్త్వం రజ స్తమ శ్చైవ ప్రాణినాం సంశ్రితాః సదా,

త్రివిధా వేదనా చైవ సర్వసత్త్వేషు దృశ్యతే,

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి భారత. 29

సత్త్వము, రజస్సు, తమస్సు అను ఈ మూడు గుణములును ఎల్లప్పుడు ప్రాణులను ఆశ్రయించుకొని యుండును. ప్రాణు లన్నింటియందును మూడు విధములైన వేదన కానవచ్చును. అది సాత్త్వికి, రాజసి, తామసి అనునదిగా నుండును.

సుఖస్పర్శః సత్త్వగుణో దుఃఖస్పర్శో రజోగుణః,

తమోగుణేన సంయుక్తౌ భవతో వ్యావహారికౌ . 30

సుఖస్పర్శ సత్త్వగుణము, దుఃఖస్పర్శ రజోగుణము. తమోగుణము కలుగగా ఈ వ్యావహారికములైన సుఖ దుఃఖములు రెండును కలుగవు.

తత్ర యత్ప్రీతి సంయుక్తం కాయే మనసి వా భవేత్ .

వర్తతే సాత్త్వికో భావ ఇత్యాచక్షీత తత్తథా . 31

శరీరమునందును, మనస్సునందును ప్రీతితో కూడినదై మెలగునది సాత్త్వికభావము అని పెద్దలు చెప్పుదురు.

అథ యద్దుఃఖ సంయుక్త మప్రీతికర మాత్మనః,

ప్రవృత్తం రజ ఇత్యేవ తన్న సంరభ్య చిన్తయేత్ . 32

దుఃఖములతో కలసియున్నది, ఆత్మకు ప్రీతికరము కానిదియు అయి మెలగునది రజస్సు. దానిని భయముతో చింతింపరాదు.

అథ యన్మోహసంయుక్త మవ్యక్త విషయం భవేత్,

అప్రతర్క్య మవిజ్ఞేయం తమస్త దుపధారయేత్. 33

ఇక ఏది మోహముతో కూడినదియు, వ్యక్తము కాని విషయములు కలదియు, ఊహింపనలవి కానిదియు, తెలియరానిదియునగునో దానిని తమస్సుగా నిర్ణయించుకొనవలయును.

ప్రహర్షః ప్రీతి రానన్దః సుఖం సంశాన్తచిత్తతా,

కథఞ్చి దభివర్తన్త ఇత్యేతే సాత్త్వికా గుణాః - 34

ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, ప్రశాంతచిత్తత అనునవి సాత్త్వికగుణములు. ఇవి మిక్కిలి దుర్లభములై ఏర్పడుచుండును.

అతుష్టిః పరితాపశ్చ శోకో లోభ స్తథా క్షమా,

లిఙ్గాని రజస స్తాని దృశ్యన్తే హేత్వహేతుభిః . 35

తుష్టిలేకుండుట, పరితాపము, శోకము, లోభము, అసహనము అనునవి. రజస్సు లింగములు (గుర్తులు). ఇవి హేతువులతో, అహేతువులతో కూడ కానవచ్చును.

అవమాన స్తథా మోహః ప్రమాదః స్వప్న తన్ద్రితా,

కథఞ్చి దభివర్తన్తే వివిధా స్తామసా గుణాః . 36

అవమానము, ఒడలు తెలియని తనము, ప్రమాదము, నిద్ర, కునుకుపాటు అను పెక్కువిధములైన తామసగుణములు ఎట్లో ఏర్పడుచుండును.

దూరగం బహుధాగామి ప్రార్థనా సంశయాత్మకమ్,

మనః సునియతం యస్య స సుఖీ ప్రేత్య చేహ చ. 37

దూరము పోవునది, పెక్కువిధములుగా తిరుగునది, ప్రార్థనలతో సంశ యాత్మకమైనది అగు మనస్సును గట్టిగా అదుపున నుంచుకొనువాడు ఇందును, పరలోకమునందును సుఖము కలవాడగును.

సత్త్యక్షేత్రజ్ఞయో రేత దన్తరం పశ్య సూక్ష్మయోః,

సృజతే తు గుణానేక ఏకోన సృజతే గుణాన్. 38

సూక్ష్మములగు సత్యము, క్షేత్రజ్ఞుడు అనువాని విశేషమును చూడుము. ఒకటి గుణములను సృజించును. ఇంకొకటి సృజింపదు.

మశకోదుమ్బరౌ వాఽ పి సంప్రయుక్తౌ యథా సదా,

అన్యోన్య మేతౌ స్యాతాం చ సంప్రయోగ స్తథా తయోః. 39

దోమ మేడిపండులవలె ఈ రెండును కలిసియుండును. ఈ సత్త్వక్షేత్రజ్ఞుల కలయిక అటువంటిది.

పృథగ్భూతౌ ప్రకృత్యా తౌ సంప్రయుక్తౌ చ సర్వదా,

యథా మత్స్యో జలం చైవ సంప్రయుక్తౌ తధైవ తౌ. 40

సహజముగా అవి రెండును వేరువేరుగా నయినట్టివి. కాని యెల్లవేళల కలసియే యుండును. ఈ కలయిక చేప, నీరు అనువాని కలయిక వంటిది.

న గుణా విదు రాత్మానం స గుణా న్వేత్తి సర్వశః,

పరిద్రష్టా గుణానాం తు సంసృష్టా న్మన్యతే తథా. 41

గుణములు ఆత్మను ఎరుగజాలవు. ఆత్మ అన్నివిధముల గుణముల నెరుగును. ఆత్మగుణములను చక్కగా చూచునది అయి తనతో కలసియున్న వానినిగా భావించును.

ఇన్ద్రియై స్తు ప్రదీపార్థం కురుతే బుద్ధిసప్తమైః

నిర్విచేష్టై రజానద్భిః పరమాత్మా ప్రదీపవత్. 42

బుద్ధితోపాటు ఏడైన ఇంద్రియములు, చేష్టలు లేనివి, ఏమియు నెరుగనివి అయి పెద్దవెలుగుకొరకు ప్రయత్నించుచుండును. పరమాత్మ ఆ ప్రదీపము వంటిది.

సృజతే హి గుణాన్ సత్త్వం క్షేత్రజ్ఞః పరిపశ్యతి,

సంప్రయోగ స్తయో రేష సత్త్వ క్షేత్రజ్ఞయో ర్ధ్రువః . 43

సత్త్వము గుణములను సృజించును. క్షేత్రజ్ఞుడు వానిని అన్నివైపులనుండి చూచుచుండును. సత్వక్షేత్రజ్ఞులకు గల సంబంధము ఇట్లు ధ్రువము (అనాది సిద్ధము).

ఆశ్రయో నాస్తి సత్త్వస్య క్షేత్రజ్ఞస్య చ కశ్చన,

సత్త్వం మనః సంసృజతే న గుణాన్ వై కదాచన. 44

సత్త్వమునకు క్షేత్రజ్ఞనకు ఏవిధమైన ఆశ్రయమును లేదు. సత్వము మనస్సును నిర్దేశించును. కాని ఎన్నటికిని గుణములను కాదు.

రశ్మీంస్తేషాం స మనసా యదా సమ్య ఙ్నియచ్ఛతి,

తదా ప్రకాశతేఽ స్యాత్మా ఘటే దీపో జ్వల న్నివ. 45

క్షేత్రజ్ఞుడు సత్వము కిరణములవంటి ఇంద్రియములను ఎప్పుడు చక్కగా నిలువరించునో అప్పుడు అది కుండయందలి దీపమువలె ప్రకాశించును.

త్యక్త్వా యః ప్రాకృతం కర్మ నిత్య మాత్మరతి ర్మునిః,

సర్వభూతాత్మభూ స్తస్మాత్ స గచ్ఛే దుత్తమాం గతిమ్ . 46

ఎవడు ప్రాకృత కర్మమును వదలివైచి నిత్యము ఆత్మమునందే ప్రీతికలవాడై, మునియై, సర్వభూతముల ఆత్మయే అయినవాడగునో అతడు దానివలన ఉత్తమ గతి కరుగును.

యథా వారిచరః పక్షీ సలిలేన న లిప్యతే,

ఏవమేవ కృతప్రజ్ఞో భూతేషు పరివర్తతే . 47

నీటిలో తిరిగెడు పక్షికి నీరు అంటని విధమున ప్రజ్ఞ పండినవాడు భూతముల యందు అంటులేకుండ తిరుగుచుండును.

ఏవం స్వభావ మే వైతత్స్వ బుద్ధ్యా విహరే న్నరః,

అశోచ న్నప్రహృష్యంశ్చ సమో విగతమత్సరః . 48

ఇట్లు అంటులేని ఈ స్వభావమును స్వబుద్ధితో నిశ్చయించుకొని దుఃఖములతో క్రుంగిపోక, సంతోషముతో పొంగిపోక, రెంటియందును సముడై మత్సరమును విడనాడి నరుడు తిరుగుచుండవలయును.

స్వభావయుక్త్యా యుక్తస్తు స నిత్యం సృజతే గుణాన్,

ఊర్ణనాభి ర్యథా సూత్రం విజ్ఞేయా స్తంతువద్గుణాః. 49

ఈ విధముగా తత్త్వమెరిగినవాడు స్వభావమునందలి యోగముతో కూడినవాడై, సాలెపురుగు దారమును నిర్మించినట్లు, నిత్యము గుణములను సృజించును. గుణములు దారములవంటివని తెలియనగును.

ప్రధ్వస్తా న వివర్తన్తే నివృత్తి ర్నోపలభ్యతే,

ప్రత్యక్షేణ పరోక్షం తదనుమానేన సిధ్యతి. 50

ఏవమేకేఽ ధ్యవస్యన్తి నివృత్తి రితి చాపరే,

ఉభయం సంప్రధార్యైత ద్వ్యవస్యేత యథామతి. 51

కొందరు అట్టినరుల గుణములు నశింపవందురు. కొందరు అవి యన్నియు రూపుమాసిపోవు నందురు. ఈ స్థితి ప్రత్యక్ష ప్రమాణముతో తెలియదగినది కాదు. అనుమాన ప్రమాణముతో సిద్ధించును.

ఇట్లు కొందరు నిర్ణయింతురు. ఇతరులు నివృత్తి కూడ ప్రత్యక్షమే అందురు. ఈ రెంటిని చక్కగా విచారించి తన బుద్ధిని బట్టి నిర్ణయించుకొనవలయును.

ఇతీమం హృదయగ్రన్ధిం బుద్ధిభేదమయం దృఢమ్,

విముచ్య సుఖ మాసీత నశోచే చ్ఛిన్నసంశయః. 52

బుద్ధిభేదమువలన ఏర్పడిన ఈ ఎదలోని పీటముడిని విడగొట్టుకొని సుఖముగా నుండవలయును. సంశయము విడిపోయినవాడు శోకింపడు.

మలినాః ప్రాప్నుయుః సిద్ధిం యథా పూర్ణాం నదీం నరాః,

అవగాహ్య సువిద్వాంసో విద్ధి జ్ఞాన మిదం తథా . 53

మాలిన్యము గల నరుడు నిండునదిలో మునిగి సిద్ధిని పొందినట్లు గొప్ప విద్వాంసులు జ్ఞానసిద్ధిని పొందుదురు. ఈ జ్ఞానమట్టిదని ఎరుగుము.

మహానద్యా హి పారజ్ఞ స్తప్యతే న తదన్యథా,

న తు తప్యతి తత్త్వజ్ఞః ఫలే జ్ఞాతే తరత్యుత. 54

మహానది ఆవలిఒడ్డును తెలిసినవాడు కృతార్థుడు కాడు. తత్త్వమెరిగినవాడు బాధపడడు. ఫలము తెలియరాగా సాధనముతో దానిని దాటును.

ఏవం యే విదు రాధ్యాత్మం కేవలం జ్ఞానముత్తమమ్. 55

ఇట్లు కేవలము, ఉత్తమము అయిన, అధ్యాత్మజ్ఞానమును ఎరిగినవారు మాత్రమే ఈ సంసారమును దాటుదురు.

ఏతాం బుద్ధ్వా నరః సర్వాం భూతానా మాగతిం గతిమ్,

అవేక్ష్య చ శనై ర్బుద్ధ్యా లభతే శమనం తతః. 56

ఇట్లు భూతముల రాకపోకలను తెలిసికొని నరుడు, బుద్ధితో దాని తత్త్వమును మెల్లగా పట్టుకొని అనంతమైన సుఖమును పొందును.

త్రివర్గో యస్య విదితః ప్రేక్ష్య యశ్చ విముఞ్చతి,

అన్విష్య మనసా యుక్త స్తత్త్వదర్శీ నిరుత్సుకః. 57

ఎవడు త్రివర్గమును చక్కగా తెలిసికొని, పరికించి వదలివైచి, మనసుతో కూడినవాడై తత్వదర్శియగునో వాడు నిరుత్సుకుడు - ఏ కోరికలు లేనివాడు - అగును.

న చాత్మా శక్యతే ద్రష్టు మిన్రియై శ్చ విభాగశః,

తత్ర తత్ర విసృష్టైశ్చ దుర్వార్యై శ్చాకృతాత్మభిః. 58

అందందు చెదిరినవి, వారింపనలవి కానివి, బుద్ధిపండనివి అగు ఇంద్రియములకు విస్పష్టముగా ఆత్మను దర్శించుట సాధ్యము కాదు.

ఏత ద్బుద్ధ్వా భవద్బుద్ధః కిమన్య ద్బుద్ధ లక్షణమ్,

విజ్ఞాయ తద్ధి మన్యన్తే కృతకృత్యా మనీషిణః 59

ఇది తెలిసికొన్న వాడే నిజముగా తెలివిగల వాడగును. ఇంతకంటె బుద్ధ లక్షణము మరియేమి కలదు? దానిని చక్కగా ఎరిగిన జ్ఞానసంపన్నులు తమ్ము కృతకృత్యులుగా భావింతురు.

న భవతి విదుషాం తతో భయం

యదవిదుషాం సుమహద్భయం భవత్,

న హి గతి రధికాఽస్తి కస్యచిత్

సతి హి గుణే ప్రవదన్త్యతుల్యతామ్ . 60

చక్కగా తెలిసినవారికి భయము కలుగదు. తెలియనివారికి పెనుభయము కలుగును. దీనికంటె గొప్పదియగు గతి ఎవ్వనికిని లేదు. గుణమున్నచో హెచ్చు తగ్గులను చెప్పుదురు.

యః కరో త్యనభిసంధిపూర్వకం

తచ్చ నిర్ణుదతి యత్పురాకృతమ్,

నాప్రియం తదుభయం కుతః ప్రియం

తస్య తజ్జనయతీహ సర్వతః . 61

తగులములు లేకుండ కర్మములు చేయువానికి అది పూర్వజన్మ కర్మమును కూడ తొలగించి వేయును. అట్టివానికి ప్రియము, అప్రియమును - రెండును ఉండవు. అతనికి అది అన్నియెడల పుణ్యపాపములను పుట్టింపదు.

లోకమాతుర మసూయతే జన,

స్తస్య తజ్జనయతీహ సర్వతః . 62

జనుడు ఆతురమైన లోకమునెడ అసూయ పొందుచుండును. అట్టివానికది అన్నియెడల పుణ్యపాపములను పుట్టించును.

లోక ఆతురజనా న్నిరావిశం

స్తత్త దేవ బహు పశ్య శోచతః,

తత్ర పశ్య కుశలా నశోచతో

యే విదు స్తదుభయం పదం సతామ్. 63

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
అధ్యాత్మకథనే చతుర్న వత్యధిక శతతమోఽధ్యాయః

లోకమునందు చక్కని పరిశీలన బుద్ధి కలవాడవగుచు ఆతురులైన జనులను, పెల్లుగా శోకించువారిని చూడుము. మరియు నందే జ్ఞానసంపన్నులై దుఃఖింపని వారిని కూడ చూడుము. ఆ ఉభయమును చక్కగా ఎరిగినవారే ఉపాసకులకు పదము.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున
అధ్యాత్మకథనము గల నూటతొంబదినాలుగవ అధ్యాయము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

హన్త వక్ష్యామి తే పార్థ ధ్యానయోగం చతుర్విధమ్,

యం జ్ఞాత్వా శాశ్వతీం సిద్ధిం గచ్ఛ న్తీహ మహర్షయః. 1

నాయనా! పార్థా! నాలుగు విధములైన ధ్యానయోగములను నీకు చెప్పెదను. దీని నెరిగియే మహర్షులు శాశ్వతసిద్ధిని పొందుచున్నారు.

యథా స్వనుష్ఠితం ధ్యానం తథా కుర్వన్తి యోగినః,

మహర్షయో జ్ఞానతృప్తా నిర్వాణ గత మానసాః. 2

జ్ఞానముచేత తృప్తినందినవారు, నిర్వాణమునందు లగ్నమైన మనస్సు కలవారు యోగులునగు మహర్షులు ధ్యానమును చక్కగా అభ్యసించి చేయుచుందురు.

నావర్తన్తే పునః పార్థ ముక్తాః సంసారదోషతః,

జన్మదోష పరిక్షీణాః స్వభావే పర్యవస్థితాః. 3

అట్టివారు సంసారదోషములనుండి విడివడిన వారు, జన్మ దోషములను ఎండ గట్టినవారు, స్వరూపము నందు స్థిరముగా నున్నవారునై మరల తిరిగి రారు. (వారికి మరల జన్మము లేదు).

నిర్ద్వన్ద్వా నిత్యసత్త్వస్థా విముక్తా నియమస్థితాః,

అసఙ్గా న్యవివాదీని మనఃశాన్తి కరాణి చ. 4

ద్వంద్వములను వదలినవారు, నిత్యము ప్రకాశమునందున్నవారు, లోభాదులను విడనాడినవారు, నియమములందు నిలిచి యున్నవారు. సంగములు లేనివి, వివాదములు లేనివి, మనస్సును ప్రసన్నము చేయునవి యగు స్థానములను సేవించువారు - నగుదురు.

తత్ర ధ్యానేన సంశ్లిష్ట మేవాగ్రం ధారయేన్మనః,

పిణ్డీకృత్యేన్ద్రియగ్రామ మాసీనః కాష్ఠవన్మునిః. 5

అట్టి స్థానములందు ధ్యానముతో కూడియున్న మనస్సును ఏకాగ్రముగా పట్టుకొన వలయును. ఇంద్రియముల సముదాయమును ముద్దగా చేసి కొయ్యవలె కూర్చుండి మౌనమును పాటింపవలయును.

శబ్దం న విన్దే చ్ఛ్రోత్రేణ స్పర్శం త్వచా న వేదయేత్,

రూపం న చక్షుషా, విద్యా జ్జిహ్వయా న రసాంస్తథా. 6

చెవితో శబ్దమును, చర్మముతో స్పర్శను, కంటితో రూపమును, నాలుకతో రుచులను గ్రహింపరాదు.

ఘ్రేయాణ్యపి చ సర్వాణి జహ్యా ద్ధ్యానేన యోగవిత్,

పఞ్చవర్గప్రమాథీని నేచ్ఛేచ్చైతాని వీర్యవాన్. 7

యోగము నెరిగినవాడు ధ్యానముతో వాసనల నన్నింటిని వదలివేయ వలయును. చెవి మొదలగు అయిదింటిని వ్యాకుల పరిచెడు ఈ శబ్దాదులను కోరరాదు.

తతో మనసి సంగృహ్య పఞ్చవర్గం విచక్షణః,

సమాదధ్యా న్మనో భ్రాంత మిన్ద్రియైః సహ పంచభిః. 8

ఈ అయిదింటిని మనస్సున సంగ్రహించి భ్రమ చెందెడు మనస్సును ఇంద్రియములతో పాటు చెదరకుండ నిలుపవలయును.

విసంచారి నిరాలంబం పఞ్చద్వారం చలాచలమ్,

పూర్వం ధ్యాన పథే ధీరః సమాదధ్యా న్మనోఽన్తరా. 9

పెక్కు తీరుల సంచరించునదియు, అయిదు ఇంద్రియములే ద్వారములుగా కలదియు, చలించు విషయములయందు కదలకుండునదియు నగుమనస్సును, హార్దాకాశమున ఆలంబనములేనిదిగా చేసి ధ్యానమార్గమున స్థిరముగా నుండునట్లు చేయవలయును.

ఇన్ద్రియాణి మనశ్చైవ యదా పిండీకరో త్యయమ్,

ఏష ధ్యానపథః పూర్వో మయా సమనువర్ణితః. 10

ఇంద్రియములను మనస్సును ముద్దగా చేయుట అనునదియే ముఖ్యమైన ధ్యాన పథము. నేను ఇంతకు ముందు వర్ణించినది అదియే.

తస్య తత్పూర్వ సంరుద్ధ మాత్మనః షష్ఠ మాన్తరమ్,

స్ఫురిష్యతి సముద్భ్రాన్తా విద్యుదంబుధరే యథా. 11

ఆ ఆత్మలోపలి ఆరవ అంగమగు మనస్సు మునుపు బాగుగా అరికట్టబడినప్పటికిని, మేఘమునందు మెరపు చకచక అటునిటు కదలినట్లు సంచలించును.

జలబిన్దు ర్యథా లోలః పర్ణస్థః సర్వత శ్చలః,

ఏవ మేవాస్య చిత్తం చ భవతి ధ్యానవర్త్మని. 12

ఆకుపై నున్న నీటి బిందువు చంచలమై అంతట కదలుచున్నట్లు ఈతని చిత్తము కూడ ధ్యానమార్గమున కదలిపోవుచుండును.

సమాహితం క్షణం కిఞ్చి ద్ధ్యానావర్త్మని తిష్ఠతి,

పున ర్వాయుపథం భ్రాన్తం మనో భవతి వాయువత్. 13

ఒక్క క్షణము ధ్యాన మార్గమున నిలువరింప బడినదై నిలిచి యుండును. కాని మనస్సు వాయు మార్గమును చేరుకొని వాయువు వలె భ్రమించునది యగును.

అనిర్వేదో గతక్లేశో గతతన్ద్రి రమత్సరీ,

సమాదధ్యా త్పున శ్చేతో ధ్యానేన ధ్యానయోగవిత్. 14

క్లేశము పొందినవాడయ్యు నిర్వేదమును విడనాడినవాడును, అలసత, మత్సరములేనివాడై ధ్యానయోగము నెరిగినవాడు ధ్యానముతో మరల చిత్తమును కదలకుండ చేయవలయును.

విచారశ్చ వివేకశ్చ వితర్కశ్చోపజాయతే,

మునేః సమాదధానస్య ప్రథమం ధ్యానమాదితః. 15

మొదట ధ్యానము చేయబోవు మునికి విచారము, వివేకము, వితర్కము పుట్టుచుండును.

మనసా క్లిశ్యమానస్తు సమాధానం చ కారయేత్, 16

న నిర్వేదం మునిర్గచ్ఛేత్కుర్యా దేవాత్మనో హితమ్.

మనస్సుతో నలిగిపోవుచున్నవాడైనను, సమాధిని చేయవలయును. ముని నిర్వేదమును పొందరాదు. తనకు హితమునే చేయవలయును.

పాంసుభస్మకరీషాణాం యథా వై రాశయ శ్చితాః,

సహసా వారిణా సిక్తా న యాన్తి పరిభావినమ్. 17

దుమ్ము, బూడిద, ఎండుపిడకలపొడి అనువాని కుప్పలు ఒక్క పెట్టున నీటితో తడుపబడినను ప్రతిమలుగా మారుట లేదు.

కిఞ్చిత్ స్నిగ్ధం యథా చ స్యా చ్ఛుష్క చూర్ణ మభావితమ్,

క్రమశస్తు శనై ర్గచ్చేత్ సర్వం తత్పరిభావనమ్. 18

ఆ ఎండు పొడిని కొంచెము తడిచేసి నానబెట్టినచో క్రమముగా మెల్లగా అది అంతయు విగ్రహము చేయు స్థితిని పొందును.

ఏవ మేవేన్ద్రియగ్రామం శనైః సంపరిభావయేత్,

సంహరేత్ క్రమశ శ్చైవ స సమ్యక్ ప్రశమిష్యతి. 19

ఇట్లే ఇంద్రియముల సముదాయమును మెల్లగా పాకమునకు తేవలయును. క్రమముగా దానిని ఉపసంహరింప వలయును. అప్పుడది చక్కగా అణగారును.

స్వయమేవ మనశ్చైవం పంచవర్గం చ భారత,

పూర్వం ధ్యానపథే స్థాప్య నిత్యయోగేన శామ్యతి. 20

ఈ విధముగా మనస్సును, అయిదింద్రియముల గణమును మొదట ధ్యానపథమున నిలుపగా నిత్యయోగముచేత అవియే అణగారిపోవును.

న తత్పురుషకారేణ న చ దైవేన కేనచిత్,

సుఖ మేష్యతి తత్తస్య యదేవం సంయతాత్మనః. 21

పురుష ప్రయత్నముతో కాని ఏదేని దైవముచేత కాని మనస్సును నిలువరించినవాడు పొందెడు ఈ సుఖమును పొందుట (ఇతరులకు) సాధ్యము కాదు.

సుఖేన తేన సంయుక్తో రంస్యతే ధ్యానకర్మణి,

గచ్ఛన్తి యోగినో హ్యేవం నిర్వాణం సన్నిరామయమ్. 22

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
ధ్యాన యోగకథనే పఞ్చనవత్యధిక శతతమోఽధ్యాయః

ఈ ఆనందముతో కూడినవాడు ధ్యాన కర్మమునందే రమించుచుండును. యోగులు కూడ ఇదే విధముగా ఇతర వాసనలు లేని కైవల్యమును పొందెదరు.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున ధ్యాన యోగ కథనముగల నూట తొంబదియైదవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.

చాతురాశ్రమ్య యుక్తం తే రాజధర్మా స్తథైవ చ,

నానాశ్రయాశ్చ బహవ ఇతిహాసాః పృథగ్విధాః. 1

నీవు నాలుగాశ్రమములను గూర్చి చెప్పితివి. అట్లే రాజధర్మములను వివరించితివి. పెక్కు భావముల నాశ్రయించిన పెక్కు అంశములను, వేరు వేరు విధములుగల ఇతిహాసములను కూడ నీవలన వింటిమి.

శ్రుతా స్త్వత్తః కథాశ్చైవ ధర్మయుక్తా మహామతే,

సందేహోఽస్తి తు కశ్చిన్మే తద్భవాన్ వక్తు మర్హతి. 2

ఓ మహామునీ! ధర్మముతో కూడిన కథల నెన్నింటినో నీ వలన వింటిని. ఒక్క సందేహము మాత్రము కలదు. దానిని నీవు తీర్పవలయును.

జాపకానాం ఫలావాప్తిం శ్రోతు మిచ్ఛామి భారత,

కిం ఫలం జపతా ముక్తం క్వ వా తిష్ఠన్తి జాపకాః. 3

జపము చేయువారెట్టి ఫలమును పొందుదురో వినగోరుచున్నాను. జపించువారు పొందెడు ఫలమేమి? జపము చేయువారు ఎందు నిలుతురు?

జప్యస్య చ విధిం కృత్స్నం వక్తు మర్హసి మేఽనఘ,

జాపకా ఇతి కిఞ్చైతత్ సాంఖ్యయోగ క్రియావిధిః. 4

పుణ్యాత్మా! జపసంబంధమైన దాని విధిని మొత్తముగా నాకు చెప్పుడు. జాపకులు అనువారు వేదాంతవిచారము, యోగము, యోగాదికర్మములు అనునవి చేయువారిలో ఏ విభాగమునకు చెందినవారు?

కిం యజ్ఞవిధి రేవైష కిమేత జ్జప్య ముచ్యతే,

ఏతన్మే సర్వమాచక్ష్వ సర్వజ్ఞో హ్యసి మే మతః. 5

లేక ఇది బ్రహ్మయజ్ఞ విధియా? జపమునకు సంబంధించినది ఇది ఏది? దీని నంతయు నాకు తెలియ జెప్పుము. నా అభిప్రాయమున నీవు సర్వము తెలిసినవాడవు.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

యమస్య యత్పురా వృత్తం కాలస్య బ్రాహ్మణస్య చ. 6

ఈ విషయమునందును ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుచుందురు. యముడు, కాలము, బ్రాహ్మణుడు అను వారికి సంబంధించి జరిగినదీ కథ.

సాంఖ్యయోగౌ తు యావుక్తౌ మునిభి ర్మోక్షదర్శిభిః,

సంన్యాస ఏవ వేదాన్తే వర్తతే జపనం ప్రతి.

వేదవాదాశ్చ నిర్వృత్తాః శాన్తా బ్రహ్మణ్యవస్థితాః. 7

మోక్షమును దర్శించిన మునులు సాంఖ్యమును యోగమును తెలిపియున్నారు. అందు వేదాంతమున జపమును గూర్చి సంన్యాసమే ఫలముగా నగుచున్నది. ఏలయన వేదవాదములన్నియు బ్రహ్మమునందే పర్యవసించునవి. శాంతములు నిర్వృత్తములు.

సాంఖ్యయోగౌ తు యావుక్తౌ మునిభిః సమదర్శిభిః,

మార్గౌ తావప్యుభా వేతౌ సంశ్రితౌ న చ సంశ్రుతౌ. 8

సమమును దర్శించెడు మునులు చెప్పెడు సాంఖ్యము యోగము అను రెండు మార్గములును జపమును ఆశ్రయించి యున్నట్టివే. మరియు సంబంధింపనివే.

యథా సంశ్రూయతే రాజన్ కారణం చాత్ర వక్ష్యతే,

మనః సమాధి రత్రాపి తథేన్ద్రియజయః స్మృతః. 9

రాజా! ఇందు వినవచ్చెడు కారణమును చెప్పుచున్నాము. ఇందును మనస్సును నిగ్రహించుట, ఇంద్రియములను గెలుచుట అనునవి కలవు.

సత్య మగ్నిపరీచారో వివిక్తానాం చ సేవనమ్,

ధ్యానం తపో దమః క్షాన్తి రనసూయా మితాశనమ్. 10

విషయప్రతి సంహారో మితజల్ప స్తథా శమః,

ఏష ప్రవర్తకో యజ్ఞో నివర్తక మథో శృణు. 11

సత్యము, అగ్ని పరిచర్య, ఏకాంత ప్రదేశములను సేవించుట, ధ్యానము, తపస్సు, దమము, క్షమ, అసూయ లేకుండుట, మిత భోజనము, విషయములను జయించుట, మితముగా పలుకుట, శమము అనునవి జపమునకు అంగమగు ప్రవర్తక ధర్మము. ఇక నివర్తకమగు ధర్మమును గూర్చి వినుము.

యథా నివర్తతే కర్మ జపతో బ్రహ్మచారిణః,

ఏతత్సర్వ మశేషేణ యథోక్తం పరివర్తయేత్. 12

జపమొనరించు, బ్రహ్మచారికి కర్మము మరలిపోవు విధమున ఇంతకుముందు చెప్పిన మనస్సును నిలువరించుకొనుట మొదలగునది అంతయు నిష్కామరూపమున మారిపోవలయును.

నివృత్తం మార్గ మాసాద్య వ్యక్తావ్యక్త మనాశ్రయమ్. 13

వ్యక్తమును గాని అవ్యక్తమును గాని ఆశ్రయింపని వెనుకకు మరలిన మార్గమును అవలంబింపవలయును.

కుశోచ్చయనిషణ్ణ స్సన్ కుశహస్తః కుశైః శిఖీ,

కుశైః పరివృత స్తస్మిన్ మధ్యేచ్ఛన్నః కుశై స్తథా. 14

కుశల సముదాయముపై కూర్చున్నవాడై, కుశములు చేత దాల్చిన వాడై, కుశములతో శిఖలు కలవాడై, కుశలనే అన్ని వైపుల నుంచుకొన్నవాడై, కుశముల నడుమ కప్పబడిన వాడై యుండవలయును.

విషయేభ్యో నమస్కుర్యా ద్విషయా న్న చ భావయేత్,

సామ్య ముత్పాద్య మనసా మనస్యేవ మనో దధత్. 15

విషయములకు నమస్కరింపవలయును. విషయములను భావింపరాదు. మనస్సుతో సమస్థితిని ఏర్పరచుకొని మనస్సునందే మనస్సును పట్టియుంచుచుండ వలయును.

తద్ధియా ధ్యాయతి బ్రహ్మ జపన్ వై సంహితాం హితామ్,

సంన్న్య స్య త్యథవా తాం వై సమాధౌ పర్యవస్థితః. 16

ఆ సమత్వము పొందిన బుద్ధితో బ్రహ్మమును ధ్యానించును. మేలుగూర్చు సంహితను (వేద భాగమును) జపించుచుండును. సమాధియందు చక్కగా నెలకొన్నవాడై పిదప సంన్యసించును.

ధ్యానముత్పాదయ త్యత్ర సంహితా బలసంశ్రయాత్,

శుద్ధాత్మా తపసాదాన్తో నివృత ద్వేష కామవాన్.

అరోగమోహో నిర్దన్ద్వో న శోచతి న సజ్జతే. 17

బలము పుంజుకొనుటవలన సంహిత అతనియందు ధ్యానమును పుట్టించును. దానితో నతడు శుద్ధమైన బుద్ధి కలవాడు, తపస్సు చేత అలవడిన ఇంద్రియనిగ్రహము కలవాడు, రోగ మోహములు లేనివాడు, ద్వంద్వములు రూపు మాపినవాడు నయి శోకింపడు, తగులము పొందడు.

న కర్తా కారణానాం చ నకార్యాణా మితి స్థితిః. 18

న చాహంకార యోగేన మనః ప్రస్థాపయే త్క్వచిత్,

న చార్థగ్రహణే యుక్తో నావమానీ నచాక్రియః 19

అట్టి దశలో అతడు కారణములకు కార్యములకు కర్త కారాదు. అహంకార సంబంధము చేత మనస్సును ఎందును తగులుకొన నీయరాదు. ధనాదుల రాబడియందు తగులము ఉండదు. అవమానములను లెక్క చేయడు. అట్లని నిష్క్రియుడై ఉండడు.

ధ్యానక్రియాపరో యుక్తో ధ్యానవాన్ ధ్యాననిశ్చయః,

ధ్యానే సమాధి ముత్పాద్య తదపి త్యజతి క్రమాత్. 20

ధ్యానక్రియయే సర్వము అయినవాడు, ధ్యాననిష్ఠ కలవాడు, ధ్యానమునందు నిశ్చయముకలవాడునై ధ్యానసమాధిని ఏర్పరచుకొని క్రమముగా దానిని కూడ త్యజించును.

సవై తస్యా మవస్థాయాం సర్వత్యాగ కృతః సుఖమ్,

నిరిచ్ఛ స్త్యజతి ప్రాణాన్ బ్రాహ్మీం సంవిశతే తనుమ్. 21

అతడు అట్టి అవస్థయందు సర్వ త్యాగము చేసిన వాని సుఖమును పొందును. కోరికలు లేనివాడై ప్రాణములను వదలును. బ్రాహ్మియగు తనువును ప్రవేశించును.

అథవా నేచ్ఛతే తత్ర బ్రహ్మకాయ నిషేవణమ్,

ఉత్క్రామతి చ మార్గస్థో నైవ క్వచన జాయతే. 22

ఆ స్థితిలో బ్రహ్మ కాయమును పొందుట కతడు ఇష్టపడనిచో, మార్గమునందున్నవాడై పైకి వెడలును. మఱి యెందును పుట్టడు.

ఆత్మబుద్ధ్యా సమాస్థాయ శాన్తీభూతో నిరామయః,

అమృతం విరజః శుద్ధ మాత్మానం ప్రతిపద్యతే. 23

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
జాపకోపాఖ్యానే షణ్ణవత్యధిక శతతమోఽధ్యాయః

ఆత్మ బుద్ధితో స్థిరముగా నిలిచి శాంతిగా రూపొందినవాడై చావు, ముదిమి లేనివాడై అమృతము, విరజము, శుద్ధము నగు ఆత్మను పొందును.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మపర్వమున
జాపకోపాఖ్యానము గల నూట తొంబది ఆరవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

గతీనా ముత్తమ ప్రాప్తిః కథితా జాపకే ష్విహ,

ఏకై వైషా గతి స్త్వేషా ముత యాన్త్యపరా మపి. 1

జపపరాయణులైన వారి విషయమున గతులలో ఉత్తమగతి లభించునని చెప్పితివి. వీరికి ఇదియే గతియా? మరియొక గతిని కూడ వారు పొందుదురా?

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

శృణుష్వావహితో రాజన్ జాపకానాం గతిం విభో,

యథా గచ్ఛన్తి నిరయా ననేకాన్ పురుషర్షభ. 2

పురుష శ్రేష్ఠా! విభూ! రాజా! జపపరాయణుల గతిని గూర్చి చెదరని మనసు కలవాడవై వినుము. అట్లే వారు పెక్కు నిరయములను ఎట్లు పొందుదురో దానిని కూడ వినుము.

యథోక్త పూర్వం పూర్వం యో నానుతిష్ఠతి జాపకః,

ఏకదేశక్రియ శ్చాత్ర నిర్ణయం స చ గచ్ఛతి. 3

జాపకుడు ఇంతకుమునుపు చెప్పినదానిని ముందు అనుష్ఠింపక ఒక భాగమున మాత్రమే జపకార్యము కలవాడైనచో అతడు నరకమునకు పోవును.

అవమానేన కురుతే న ప్రియతి న హృష్యతి,

ఈదృశో జాపకో యాతి నిర్ణయం నాత్ర సంశయః. 4

శ్రద్ధ లేకుండ జపము చేయువాడు, ప్రీతి పొందని వాడు, హర్షము పొందనివాడునగు జాపకుడు నరకము పొందును. ఇందు సంశయము లేదు.

అహఙ్కార కృత శ్చైవ సర్వే నిరయగామినః,

పరావమానీ పురుషో భవితా నిరయోపగః. 5

అహంకారముతో జపము చేయువారందరు నరకమునకు పోవువారే. ఇతరుల నవమానించు జాపకుడు నరకమునకు పోవువాడే యగును.

అభిధ్యాపూర్వకం జప్యం కురుతే యశ్చ మోహితః,

యత్రాస్య రాగః పతతి తత్ర తత్రోపపద్యతే. 6

ఫలముమీది ఆశతో మోహముకలవాడై జపముచేయువాడు, అతని రాగ మెందుపడునో, అందందు జన్మమెత్తును.

అథైశ్వర్య ప్రవృత్తేషు జాపక స్తత్ర రజ్యతే,

స ఏవ నిరయ స్తస్య నాసౌ తస్మాత్ప్రముచ్యతే. 7

అట్లే అణిమ మొదలగు సిద్ధులయందు అనురాగము పొందు జాపకునకు అదియే నరకము. అతడు దానినుండి ఎన్నటికిని విముక్తి పొందడు.

రాగేణ జాపకో జప్యం కురుతే తత్ర మోహితః,

యత్రాస్య రాగః పతతి తత్ర తత్రోపపద్యతే. 8

మోహము కలవాడై రాగముతో జాపకుడు జపమాచరించునేని యెందెందు అతని రాగము పడునో అందందు పుట్టుచుండును.

దుర్భుద్ధి రకృతప్రజ్ఞ శ్చలే మనసి తిష్ఠతి,

చలా మేవ గతిం యాతి నిరయం వా నియచ్ఛతి. 9

చెడినబుద్ధికలవాడు, పండనిప్రజ్ఞకలవాడునై చంచలమగుమనస్సునందే నిలుచువాడు చంచలమగు గతికే యరుగును. నరకమునందే స్థిరముగా నిలుచును.

అకృత ప్రజ్ఞకో బాలో మోహం గచ్ఛతి జాపకః,

స మోహా న్నిరయం యాతి తత్ర గత్వాఽనుశోచతి. 10

ప్రజ్ఞ నిలువని బాలుడగు జాపకుడు మోహమును పొందును. ఆ మోహమువలన నతడు నిరయమున కరుగును. అచట కరిగి దుఃఖించుచునే యుండును.

దృఢగ్రాహీ కరోమీతి జాప్యం జపతి జాపకః,

న సంపూర్ణో న సంయుక్తో నిరయం సోఽనుగచ్ఛతి. 11

గట్టిపట్టు పట్టి చేయుదునని జపమును జపించు జాపకుడు సంపూర్ణుడు కాడు. దానియందు లగ్నమగు బుద్ధి కలవాడును కాడు. అట్టివాడు నరకమున కరుగును.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

అనివృత్తం పరం యత్త దవ్యక్తం బ్రహ్మణి స్థితమ్,

తద్భూతో జాపకః కస్మా త్స శరీర మిహావిశేత్. 12

స్వభావ సిద్ధము, పరము, అవ్యక్తము, బ్రహ్మమునందు నెలకొని యున్నది. యగు ఏది కలదో అదియే అయి పోయిన జాపకుడు దేనివలన ఈ శరీరమును మరల ప్రవేశించును?

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

దుష్ప్రజ్ఞానేన నిరయా బహవః సముదాహృతాః,

ప్రశస్తం జాపకత్వం చ దోషా శ్చైతే తదాత్మకాః. 13

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
జాపకోపాఖ్యానే సప్తనవత్యధిక శతతమోఽధ్యాయః.

పాడుబడిన ప్రజ్ఞానముచేత ఏర్పడు నరకములు పెక్కింటిని చెప్పియున్నారు. జపపరాయణత ప్రశస్తమైనది. దానికి సంబంధించిన దోషములు కూడ చెప్పబడినవి.

ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున

జాపకోపాఖ్యానమున నూటతొంబది యేడవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.

కీదృశం నిరయం యాతి జాపకో వర్ణయస్వ మే,

కౌతూహలం హి రాజ న్మే తద్భవాన్ వక్తు మర్హసి. 1

జప మొనరించు వాడు (భ్రష్టుడై) ఎటువంటి నరకమును పొందునో నాకు వర్ణించి చెప్పుము. రాజా! నాకు ఉత్కంఠ చెలరేగుచున్నది. నీవు చెప్పవలయును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.

ధర్మ స్యాంశప్రసూతోఽసి ధర్మిష్ఠోఽసి స్వభావతః,

ధర్మమూలాశ్రయం వాక్యం శృణుష్వావహితోఽనఘ. 2

పుణ్యాత్మా! నీవు ధర్ముని అంశతో పుట్టినవాడవు. స్వభావమును బట్టి ధర్మిష్ఠుడవు. ధర్మమూలము నాశ్రయించిన వాక్యమును చెదరని మనస్సుతో ఆలకింపుము.

అమూని యాని స్థానాని దేవానాం పరమాత్మనామ్,

నానాసంస్థాన వర్ణాని నానారూప ఫలాని చ. 3

దొడ్డబుద్ధి గల ఈ దివ్య దేహము కలవారి ఈ స్థానములు పెక్కు విధములగు ఆకృతులు, వర్ణములు, పెక్కు రూపములు గల ఫలములు అనువానిని తెలిపెదను వినుము..

దివ్యాని కామచారీణి విమానాని సభా స్తథా,

ఆక్రీడా వివిధా రాజన్ పద్మిన్యశ్చైవ కాంచనా. 4

చతుర్ణాం లోక పాలానాం శుక్రస్యాథ బృహస్పతేః,

మరుతాం విశ్వదేవానాం సాధ్యానా మశ్వినో రపి. 5

రుద్రాదిత్యవసూనాం చ తథాన్యేషాం దివౌకసామ్,

ఏతే వై నిరయా స్తాత స్థానస్య పరమాత్మనః. 6

దివ్యములు, కోరినతీరున సంచరించునవి యగు విమానములు, సభలు, పెక్కువిధములగు ఉద్యానవనములు, బంగారు తామరతీగలు, నలుగురు లోకపాలురకు, శుక్రునకు, బృహస్పతికి, మరుత్తులకు, విశ్వదేవులకు, సాధ్యులకు అశ్వులకు, రుద్రులు, ఆ దిత్యులు, వస్తువులు - అనువారికి అట్లే ఇతరులగు స్వర్గవాసులకు కలవు. ఇవియే, పరమాత్మకంటె వేరుకాని స్థానము కోరుకొనువారికి, నాయనా!, నరకములు.

అభయం చానిమిత్తం చ న తత్ల్కేశ సమావృతమ్,

ద్వాభ్యాం ముక్తం త్రిభిర్ముక్త మష్టాభి స్త్రిభిరేవ చ. 7

ఆ పరమాత్మ స్థానము భయములేనిది, స్వభావసిద్ధమైనది, క్లేశములు చుట్టుముట్టనిది, రెంటిని వదలినది, మూటిని వదలినది, ఎనిమిదింటిని వదలినది, మరల మూటిని వదలినది.

చతుర్లక్షణ వర్ణంతు చతుష్కారణ వర్జితమ్,

అప్రహర్ష మనానన్ద మశోకం విగతక్లమమ్. 8

నాలుగు లక్షణములను వదలినది, నాలుగు కారణములను విడచివైచినది, హర్షము, ఆనందము, శోకము, రోగములు అనునవి లేనట్టిది.

కాలః సంపద్యతే తత్ర కాల స్తత్ర న వై ప్రభుః,

స కాలస్య ప్రభూ రాజన్ స్వర్గస్యాపి తథేశ్వరః. 9

కాలము ఆ పరమాత్మనుండియే ఏర్పడుచున్నది. కాలము ఆ పరమాత్మ విషయమున సమర్థము కాదు. అతడే కాలమునకు ప్రభువు, స్వర్గమునకును ఈశ్వరుడు.

ఆత్మకేవలతాం ప్రాప్త స్తత్ర గత్వా న శోచతి,

ఈదృశం పరమం స్థానం నిరయా స్తే చ తాదృశాః. 10

ఆత్మ కైవల్యమును పొందినవాడు అందేగి శోకమునందడు. అది యిట్టి పరమస్థానము. ఇక నిరయములు దీనికంటె వేరైనట్టివి.

ఏ తే తే నిరయాః ప్రోక్తాః సర్వఏవ యథాతథమ్,

తస్య స్థాన వరస్యేహ సర్వే నిరయసంజ్ఞితాః. 11

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
జాపకోపాఖ్యానే అష్టనవత్యధిక శతతమోఽధ్యాయః.

ఈ నిర్ణయములన్నియు ఉన్నవున్నట్లు నీకు చెప్పితిని. ఆ శ్రేష్ఠమగు స్థానము దృష్టితో ఇచట తక్కిన వన్నియు నిరయమను పేరు కలవియే.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మ పర్వమున
జాపకోపాఖ్యానమున నూట తొంబది యెనిమిదవ అధ్యాయము.

ఆఖ్యాయికముఖమున జాపకునకు యమాదులు వశ్యులగుదురనియు, అతడు తన్ను, ఇతరులను కూడ తరింపజేయుననియు, అతడు సత్యాదికమును రక్షింప వలయుననియు, దంభాదికమును వదలవలయుననియు రెండధ్యాయములతో నిరూపించుచున్నారు.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

కాల మృత్యుయమానాం తే ఇక్ష్వాకో ర్బ్రాహ్మణస్య చ,

వివాదో వ్యాహృతః పూర్వం తద్భవాన్ వక్తు మర్హసి. 1

కాలుడు, మృత్యువు, యముడు, ఇక్ష్వాకుడు, బ్రాహ్మణుడు అనువాని సంవాదము ఇంతకుమున్ను ప్రస్తావనకు వచ్చినది. దానిని నీవు వివరించి చెప్పవలయును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

ఇక్ష్వాకోః సూర్యపుత్రస్య యద్వృత్తం బ్రాహ్మణస్య చ. 2

ఇందును ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని చెప్పుకొందురు. అది సూర్యుని కుమారుడగు యమునకు ఇక్ష్వాకువునకు ఒక బ్రాహ్మణునకు నడుమ జరిగినది.

కాలస్య మృత్యోశ్చ తథా యద్వృత్తం త న్నిబోధ మే,

ప్రథా స తేషాం సంవాదో యస్మిన్ స్థానేఽపి చాభవత్. 3

అట్లే అది కాలమునకు, మృత్యువునకును సంబంధించి జరిగినది. దానిని నా నుండి తెలిసికొనుము. అది యెట్లు జరిగెనో, ఏ స్థానమున జరిగెనో చెప్పెదను.

బ్రాహ్మణో జాపకః కశ్చి ద్ధర్మవృత్తో మహాయశాః,

షడఙ్గవిన్మహాప్రాజ్ఞః పైప్పలాదిః స కౌశికః. 4

ఒకానొక జాపకుడు ధర్మమైన నడవడి కలవాడు, గొప్ప కీర్తి కలవాడు, ఆరు అంగములతో వేదము నెరిగిన గొప్ప ప్రజ్ఞాశాలి ఉండెడివాడు. అతని పేరు కౌశికుడు. పిప్పలాదుని కుమారుడు.

తస్యాపరోక్షం విజ్ఞానం షడఙ్గేషు బభూవ హ,

వేదేషు చైవ నిష్ణాతో హిమవత్పాదసంశ్రయః. 5

అతనికి వేదమునంగము లారింటి యందును తత్త్వదర్శనాత్మకమైన విజ్ఞానముండెడిది. వేదములయందును నిష్ణాతుడు. హిమవత్పర్వత సమీపమున నుండెడివాడు.

సోద్యం బ్రాహ్మం తప స్తేపే సంహితాం సంయతో జపన్,

తస్య వర్షసహస్రం తు నియమేన తథా గతమ్. 6

జ్ఞానసహితముగా అతడు బ్రహ్మమునకు సంబంధించిన తపస్సును, సంహితను జపించుచు, నిష్ఠతో చేసెను. అట్లా నియమముతో అతనికి వేయి యేండ్లు గడచెను.

స దేవ్యా దర్శితః సాక్షాత్ ప్రీతాఽస్మీతి తదా కిల,

జప్య మావర్తయం స్తూష్ణీం న స తాం కిఞ్చిదబ్రవీత్. 7

సాక్షాత్తు దేవి అతనికి ప్రత్యక్షమై ప్రీతురాలనైతి నని పలికెనట. అతడు జపమును అట్లే చేయుచు ఆమెతో ఏమియు పలుకకుండెను.

తస్యానుకంపయా దేవీ ప్రీతా సమభవత్తదా,

వేదమాతా తత స్తస్య తజ్జప్యం సమపూజయత్. 8

అతనిపై దయతో దేవి ప్రీతురాలయ్యెను. ఆ వేదమాత అంత నతని జపమును మన్నించెను.

సమాప్యజప్య స్తూత్థాయ శిరసా పాదయో స్తదా,

పపాత దేవ్యా ధర్మాత్మా వచనం చేద మబ్రవీత్. 9

జపకార్యమును ముగించుకొని లేచి ఆతడు ఆదేవి పాదములపై పడి శిరముతో నమస్కరించెను. ఆ ధర్మాత్ముడు మరియు నిట్లు పలికెను.

దిష్ట్యా దేవి ప్రసన్నా త్వం దర్శనం చాగతా మమ,

యది చాపి ప్రసన్నాఽసి జప్యే మే రమతాం మనః. 10

దేవీ! అదృష్టవశమున నీవు ప్రసన్నవయితివి. నాకు దర్శనమును కూడ అనుగ్రహించితివి. నీకు నాపై దయగలదేని నా మనస్సు ఈ జపకార్యమునందే రమించు గాక!

సావిత్ర్యువాచ - సావిత్రీ దేవి యిట్లు పలికెను.

కిం ప్రార్థయసి విప్రర్షే కిం చేష్టం కరవాణి తే,

ప్రబ్రూహి జపతాం శ్రేష్ఠ సర్వం తత్తే భవిష్యతి. 11

ఓ విప్రర్షీ! నీవేమి కోరెదవు. నీ ఇష్టమును నేను తీర్చెదను. ఓయి జాపకశ్రేష్ఠా! ఆలోచించి చెప్పుము. నీవడిగిన దెల్ల కాగలదు.

ఇత్యుక్తః స తదా దేవ్యా విప్రః ప్రోవాచ ధర్మవిత్,

జప్యం ప్రతి మమేచ్ఛేయం వర్ధత్వితి పునః పునః. 12

ఆదేవి అట్లు పలుకగా ఆమెతో ధర్మమెరిగిన ఆ విప్రుడు అమ్మా! జపకార్యమును గూర్చిన నా యిచ్ఛ పెరుగుచుండు గాక! అని మరల మరల పలికెను.

మనసశ్చ సమాధి ర్మే వర్ధేతాహరహః శుభే,

తత్తథేతి తతో దేవీ మధురం ప్రత్యభాషత. 13

'నా మనస్సునియమము ప్రతిదినము పెరుగుచుండవలయును' అని పలుకగా ఆదేవి అది యట్లే యగుగాక అని మధురముగా బదులు పలికెను.

ఇదం చైవాపరం ప్రాహ దేవీ తత్ప్రియకామ్యయా,

నిరయం నైవ యాతా త్వం యత్ర యాతా ద్విజర్షభాః. 14

మరియు నాదేవి అతనికి ప్రియము చేయుకోరిక కలదియై మరియొక మాట చెప్పెను. నాయనా! శ్రేష్ఠులగు ద్విజులు కూడ పోయెడు నిరయమునకు నీవు ఎన్నటికిని పోకుందువు.

యాస్యసి బ్రహ్మణః స్థాన మనిమిత్త మనిన్దితమ్,

సాధయే భవితా చైత ద్యత్త్వయాఽహ మిహార్థితా. 15

పునరావృత్తియు, ఏదోషములును లేనిది యగు బ్రహ్మ స్థానమునకు నీవరుగుదువు. నన్ను నీవు కోరిన విధముగా నేను దీనిని సాధింతును. నీవట్లు అగుదువు.

నియతో జప చైకాగ్రో ధర్మ స్త్వాం సముపైష్యతి,

కాలో మృత్యు ర్యమ శ్చైవ సమాయాస్యన్తి తేఽన్తికమ్. 16

భవితా చ వివాదోఽత్ర తవ తేషాం చ ధర్మతః.

నియమము కలవాడవు, నిశ్చలబుద్ధి కలవాడవునై జపము చేయుము. ధర్మదేవత నీకడకు వచ్చును. కాలుడు, మృత్యువు, యముడు నీకడకు వత్తురు. ఈ విషయమున వారికి నీతో ధర్మమునకు సంబంధించిన వివాదము కలుగును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

ఏవ ముక్త్వా భగవతీ జగామ భవనం స్వకమ్. 17

బ్రాహ్మణోఽపి జప న్నాస్తే దివ్యం వర్షశతం తథా,

సదా దాన్తో జితక్రోధః సత్యసంధోఽ నసూయకః. 18

ఇట్లు పలికి ఆ భగవతి తన భవనమున కరిగెను. బ్రాహ్మణుడును ఎల్లవేళల ఇంద్రియ నిగ్రహము కలవాడు, క్రోధమును జయించినవాడు, సత్యమునందు పట్టుదల కలవాడు, అసూయ లేనివాడునై దేవతల వేయి యేండ్లు జపించుచుండెను.

సమాప్తే నియమే తస్మిన్నథ విప్రస్య ధీమతః,

సాక్షాత్ప్రీత స్తదా ధర్మో దర్శయామాస తం ద్విజమ్. 19

ధీమంతుడగు ఆవిప్రుని ఆనియమము ముగియగా ప్రీతినొందిన ధర్ముడు స్వయముగా ఆ బ్రాహ్మణునకు సాక్షాత్కరించెను.

ధర్మ ఉవాచ - ధర్ము డిట్లు పలికెను.

ద్విజాతే పశ్య మాం ధర్మ మహం త్వాం ద్రష్టుమాగతః,

జప్యస్యాస్య ఫలం యత్తత్సంప్రాప్తం తచ్చ మే శృణు. 20

ఓయి బ్రాహ్మణా! ధర్ముడను నన్ను చూడుము. నిన్ను చూచుటకై నేను వచ్చితిని. నీవు పొందిన ఈ జపకార్య ఫలమెట్టిదో చెప్పెదను, వినుము.

జితా లోకా స్త్వయా సర్వే యే దివ్యా యే చ మానుషాః,

దేవానాం నిలయాన్ సాధో సర్వానుత్క్రమ్య యాస్యసి. 21

దేవతలకు, మానవులకు చెందిన లోకముల నన్నింటిని నీవు గెలిచితివి. దేవలోకముల నన్నింటిని దాటి నీవు పైకి అరిగెదవు.

ప్రాణత్యాగం కురు మునే గచ్ఛ లోకాన్ యథేప్సితాన్,

త్యక్త్వాత్మనః శరీరం చ తతో లోకా నవాప్స్యసి. 22

ఓ మునీ! ప్రాణత్యాగమొనరింపుము. కోరిన లోకముల కరుగుము. నీ శరీరమును వదలివైచి అటుపై లోకములను పొందెదవు.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.

కింను లోకై ర్హిమే ధర్మ గచ్ఛ త్వం చ యథాసుఖమ్,

బహుదుఃఖ సుఖం దేహం నోత్సృజేయ మహం ప్రభో. 23

ధర్ముడా! నాకు లోకములతో పనియేమి? నీవు సుఖముగా నరుగుము. జాపకుడనైన నేను పెక్కు సుఖదుఃఖములుగల మరియొక దేహమును, ప్రభూ! కల్పించుకొనను.

ధర్మ ఉవాచ - ధర్ము డిట్లు పలికెను.

అవశ్యం భోః శరీరం తే త్యక్తవ్యం మునిపుఙ్గవ,

స్వర్గ మారోహ భో విప్ర కిం వా వై రోచతేఽనఘ. 24

ఓ ముని పుంగవా! నీవు తప్పక శరీరమును వదలవలయును. ఓ విప్రా! నీ కిష్టమైనచో స్వర్గము నధిరోహింపుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

న రోచయే స్వర్గమహం వినా దేహ మహం విభో,

గచ్ఛ ధర్మ న మే శ్రద్ధా స్వర్గం గన్తుం వినాత్మనా. 25

ధర్మా! ఈ ఆత్మలేని స్వర్గమును నే నిష్టపడను. నీవు వెళ్లు. ఆత్మలేక స్వర్గమునకు పోవు శ్రద్ధ నాకు లేదు.

ధర్మ ఉవాచ - ధర్ము డిట్లనెను.

అలం దేహే మనః కృత్వా త్యక్త్వా దేహం సుఖీ భవ,

గచ్ఛ లోకా నరజసో యత్ర గత్వా న శోచసి. 26

ఓయి! దేహమునందు మనసుపెట్టకు. దేహమును వదలి సుఖవంతుడవు కమ్ము. ఎందేగి శోకింపకుందువో అట్టి పాపములేని లోకముల కరుగుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.

రమే జపన్ మహాభాగ కిం ను లోకైః సనాతనైః,

సశరీరేణ గన్తవ్యం మయా స్వర్గం నవా విభో. 27

పుణ్యాత్ముడా! నేను జపించుచు ఆనందమందుచున్నాను. ఇంక సనాతనము లగు లోకములతో నాకు పని యేమి? దేహముతో నేను స్వర్గమునకు పోవలయును. లేదా ఆ స్వర్గము నాకు వలదు.

ధర్మ ఉవాచ - ధర్ము డిట్లనెను.

యది త్వం నేచ్ఛసే త్యక్తుం శరీరం పశ్య వై ద్విజ,

ఏష కాల స్తథా మృత్యు ర్యమశ్చ త్వాముపాగతాః. 28

నీవు శరీరమును వదలగోరవేని, ఓ ద్విజా! చూడు ఇదిగో కాలుడు, మృత్యువు, యముడు నీకడకు వచ్చి యున్నారు.

భీష్మ ఉవాచ - భీష్ము డనెను.

అథ వైవస్వతః కాలో మృత్యుశ్చ త్రితయం విభో,

బ్రాహ్మణం తం మహాభాగ ముపగమ్యేద మబ్రవీత్. 29

అంత యముడు, కాలుడు, మృత్యువునను మువ్వురును ఆ పుణ్యాత్ముడగు బ్రాహ్మణుని సమీపించి యిట్లు పలికిరి.

యమ ఉవాచ - యము డిట్లనెను.

తపసోఽస్య సుతప్తస్య తథా సుచరితస్య చ,

ఫలప్రాప్తి స్తవ శ్రేష్ఠా యమోఽహం త్వా ముపబ్రువే. 30

నీవు చక్కగా ఆచరించిన తపస్సునకు, మంచి నడవడికి చక్కని ఫలము దొరకుట మేలైనది. నేను యముడను. నిన్ను పలుకరించుచున్నాను.

కాల ఉవాచ - కాలు డిట్లనెను.

యథావదస్య జప్యస్య ఫలం ప్రాప్త మనుత్తమమ్,

కాల స్తే స్వర్గ మారోఢుం కాలోఽహం త్వా ముపాగతః. 31

నీవు నియమము తప్పక చేసిన జపమునకు మేలైన ఫలము పొందవలయును. ఇది నీవు స్వర్గ మెక్కుటకు తగిన కాలము. నేను కాలుడను. నీకడకు వచ్చితిని.

మృత్యు రువాచ - మృత్యు విట్లనెను.

మృత్యుం మాం విద్ధి ధర్మజ్ఞ రూపిణం స్వయ మాగతమ్,

కాలేన చోదితో విప్ర త్వామితో నేతు మద్య వై. 32

ఓ ధర్మజ్ఞా! నన్ను మృత్యువుగా నెరుగుము. రూపము ధరించి స్వయముగా వచ్చితిని. కాలుడు ప్రేరణ చేయగా నిన్నిటనుండి కొనిపోవుటకై నేడు నీకడకు వచ్చితిని.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

స్వాగతం సూర్య పుత్రాయ కాలాయ చ మహాత్మనే,

మృత్యవే చాథ ధర్మాయ కిం కార్యం కరవాణి వః. 33

సూర్యపుత్రునకు, మహాత్ముడగు కాలునకు, మృత్యువునకు, ధర్మునకు స్వాగతము. నేను మీకేమి చేయుదును?

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

అర్ఘ్యం పాద్యం చ దత్త్వా స తేభ్య స్తత్ర సమాగమే,

అబ్రవీ త్పరమ ప్రీతః స్వశక్త్యా కింకరోమి వః. 34

అంత నతడు వారికి అర్ఘ్యమును పాద్యమును ఒసగి పరమ ప్రీతితో ఇట్లు పలికెను. నా శక్తితో నేను మీకేమి చేయగలవాడను?

తస్మిన్నే వాథ కాలే తు తీర్థయాత్రా ముపాగతః,

ఇక్ష్వాకు రగమ త్తత్ర సమేతా యత్ర తే విభో. 35

అదే సమయమున వారు కూడియున్న చోటికి తీర్థయాత్రలు చేయుచున్న ఇక్ష్వాకుడను రాజు వచ్చెను.

సర్వానేవ తు రాజర్షిః సంపూజ్యాథ ప్రణమ్య చ,

కుశల ప్రశ్న మకరోత్ సర్వేషాం రాజసత్తమః. 36

అంత నారాజర్షి, రాజులలో శ్రేష్ఠుడు వారందరిని పూజించి ప్రణమిల్లి కుశల ప్రశ్న మడిగెను.

తస్మై సోఽథాసనం దత్త్వా పాద్యమర్ఘ్యం తథైవ చ,

అబ్రవీ ద్ర్బాహ్మణో వాక్యం కృత్వా కుశల సంవిదమ్. 37

ఆ బ్రాహ్మణుడును అతని కాసన మొసగి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చి కుశల ప్రశ్న మడిగి యిట్లు పలికెను.

స్వాగతం తే మహారాజ బ్రూహి యద్య దిహేచ్ఛసి,

స్వశక్త్యా కిం కరోమీహ తద్భవాన్ ప్రబ్రవీతు మామ్. 38

ఓ మహారాజా! నీకు స్వాగతము. ఏదేది కోరుదువో దానిని చెప్పుము. నా శక్తి మేరకు నేనేమి చేయుదునో నీవు పలుక వలయును.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

రాజాఽహం బ్రాహ్మణ శ్చ త్వం యదా షట్కర్మసంస్థితః,

దదాని వసు కించిత్తే ప్రథితం త ద్వదస్వ మే. 39

నేను రాజను. నీవు ఆరుకర్మములందు నిష్ఠకల బ్రాహ్మణుడవు. నీకు మేలైన ధన మిత్తును. ఏమేమి కోరెదవో చెప్పుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

ద్వివిధా బ్రాహ్మణా రాజన్ ధర్మశ్చ ద్వివిధః స్మృతః,

ప్రవృత్తాశ్చ నివృత్తాశ్చ నివృత్తోఽ హం ప్రతిగ్రహాత్. 40

రాజా! బ్రాహ్మణు లిరుతెరగులవారు. ధర్మము కూడ రెండువిధములైనదిగా జనులు భావింతురు. ప్రవృత్తులు, నివృత్తులు అని ఆ రెండు విధముల వారు. నేను పుచ్చుకొనుట అను కర్మమునుండి మరలినవాడను.

తేభ్యః ప్రయచ్ఛ దానాని యే ప్రవృత్తా నరాధిప,

అహం న ప్రతిగృహ్ణామి కిమిష్టం కిం దదామి తే.

బ్రూహి త్వం నృపతిశ్రేష్ఠ తపసా సాధయామి కిమ్. 41

ఎవరు ప్రవృత్తిధర్మముకలవారో, రాజా! దానములు వారి కొసగుము. నేను నీ నుండి యేదియు గ్రహింపను. నీకేది యిష్టమో దాని నొసగెదను. అడుగుము. దేనిని తపస్సుతో సాధింతునో చెప్పుము.

రాజోవాచ - రాజిట్లనెను.

క్షత్రియోఽహం న జానామి దేహీతి వచనం క్వచిత్,

ప్రయచ్ఛ యుద్ధ మిత్యేవం వాదినః స్మో ద్విజోత్తమ. 42

నేను క్షత్రియుడను. దేహి(ఇమ్ము) అను పదము నెందును ఎరుగను. మాకు యుద్ధ మొసగుమని మాత్రమే పలుకువారము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

తుష్యసి త్వం స్వధర్మేణ తథా తుష్టా వయం నృప,

అన్యోన్యస్యాన్తరం నాస్తి యదిష్టం తత్సమాచర. 43

నృపా! నీవు నీ ధర్మముతో తుష్టుడవగుచున్నావు. మేమును అట్లే. మన యిరువురకు భేదము లేదు. నీకేది యిష్టమో దాని నాచరింపుము.

రాజోవాచ - రాజిట్లనెను.

స్వశక్త్యాఽహం దదానీతి త్వయా పూర్వ ముదాహృతమ్,

యాచే త్వాం దీయతాం మహ్యం జప్యస్యాస్య ఫలం ద్విజ. 44

నా శక్తి మేర కిత్తునని నీవు ఇంతకు ముందు పలికితివి. కనుక నిన్ను అడుగుచున్నాను. నాకు నీ జపక్రియా ఫలము నొసగుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.

యుద్ధం మమ సదా వాణీ యాచతీతి వికత్థసే,

న చ యుద్ధం మయా సార్థం కిమర్థం యాచసే నృప. 45

నా వాక్కు ఎల్లవేళల యుద్ధమునే కోరునని గొప్పలు పలికితివి. నాతో పాటు యుద్ధము నేల కోరుకొనవు?

రాజోవాచ - రాజిట్లు పలికెను.

వాగ్వజ్రా బ్రాహ్మణాః ప్రోక్తాః క్షత్రియా బాహుజీవినః,

వాగ్యుద్ధం తదిదం తీవ్రం మమ విప్ర త్వయా సహ. 46

బ్రాహ్మణులు వాక్కులే వజ్రముగా గలవారందురు. క్షత్రియులు బాహువులతో బ్రదుకువారు. ఆ ఈ తీవ్రమగు వాగ్యుద్ధము నీతో నాకు నగుచున్నది.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

సైవాద్యాపి ప్రతిజ్ఞా మే స్వశక్త్యా కిం ప్రదీయతామ్,

బ్రూహి దాస్యామి రాజేన్ద్ర విభవే సతి మాచిరమ్. 47

రాజేంద్రా! ఇప్పటికిని నా ప్రతిజ్ఞ అదియే. నా శక్తి మేరకు ఏమి ఈయవలయును చెప్పు ఇత్తును. విభవము ఉండగా ఆలసింపరాదు.

రాజోవాచ - రాజిట్లనెను.

యత్తద్వర్షశతం పూర్ణం జప్యం వై జపతా త్వయా,

ఫలం ప్రాప్తం తత్ప్రయచ్ఛ మమ దిత్సు ర్భవాన్ యది. 48

నీవు నాకు దానమొసగు కోరిక కలవాడవైనచో నిండు నూరేండ్లు నీవు చేసిన జపము ఫలమును నాకొసగుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

పరమం గృహ్యతాం తస్య ఫలం యజ్జపితం మయా,

అర్ధం త్వమవిచారేణ ఫలం తస్య హ్యవాప్నుహి. 49

నేను చేసిన జపముయొక్క పరమ ఫలము నందలి సగమును నీవు విచారింపక గ్రహింపుము.

అథవా సర్వ మేవేహ మామకం జాపకం ఫలమ్,

రాజన్ ప్రాప్నుహి కామం త్వం యది సర్వ మిహేచ్ఛసి. 50

లేదా నా జపఫలము మొత్తమును, రాజా నీవు కోరిన యెడల కైకొనుము.

రాజోవాచ - రాజిట్లనెను.

కృతం సర్వేణ భద్రం తే జప్యం యద్యాచితం మయా,

స్వస్తి తేఽస్తు గమిష్యామి కిఞ్చ తస్యఫలం వద. 51

మొత్తము జపఫలము, నేనడిగినది నాకు అక్కరలేదు. నీకు మేలగుగాక! నేను పోయి వచ్చెదను. కాని దాని ఫలమేమో నాకు చెప్పుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

ఫలప్రాప్తిం న జానామి దత్తం యజ్జపితం మయా,

అయం ధర్మశ్చ కాలశ్చ యమో మృత్యుశ్చ సాక్షిణః. 52

నేను జపించిన దాని ఫలమును గూర్చి నేనెఱుగను. నీకిచ్చితిని. ఈ ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు దీనికి సాక్షులు.

రాజోవాచ - రాజనెను.

అజ్ఞాత మస్య ధర్మస్య ఫలం కిం మే కరిష్యతి,

ఫలం బ్రవీషి ధర్మస్య న చేజ్జప్యకృతస్య మామ్

ప్రాప్నోతు తత్ఫలం విప్రో నాహ మిచ్ఛే ససంశయమ్. 53

తెలియని ఈ ధర్మపు ఫలము నాకేమి యొరిగించును. ఈ జపము చేసిన ధర్మపు ఫలమును నాకు చెప్పవేని ఆ ఫలము విప్రుడవగు నిన్నే చేరుగాక. సంశయముతో కూడిన దానిని నేను కోరను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.

నాదదేఽపరవక్తవ్యం దత్తం చాస్యఫలం మయా,

వాక్యం ప్రమాణం రాజర్షే మమాద్య తవ చైవ హి. 54

చెప్పవలసిన మరియొక మాట నాకు లేదు. దీని ఫలమును నేను నీ కిచ్చి వైచితిని. రాజర్షీ! నీకు గాని నాకు గాని మాటయే ప్రమాణము.

నాభిసంధి ర్మయా జప్యే కృత పూర్వః కదాచన,

జప్యస్య రాజశార్దూల కథం వేత్స్యా మ్యహం ఫలమ్. 55

రాజా! నేను మునుపెన్నడు ఈ జపమునకు ఫలము పై కోరిక పెట్టలేదు. అట్టియెడ ఈ జపము ఫలమేమో నాకెట్లు తెలియును?

దదస్వేతి త్వయా చోక్తం దదానీతి మయా తథా,

న వాచం దూషయిష్యామి సత్యం రక్ష స్థిరో భవ. 56

ఇమ్మని నీవంటివి. ఇత్తునని నేను పలికితిని. మాటను చెడగొట్ట జాలను. సత్యమును రక్షింపుము. స్థిరుడవు కమ్ము.

అథైవం వదతో మేఽద్య వచనం న కరిష్యసి,

మహానధర్మో భవితా తవ రాజన్ మృషా కృతః. 57

ఇట్లు పలుకుచున్న నా మాటను నీవు పాటింపకున్నచో, నాకు అసత్యదోషము కల్పించునీకు గొప్ప అధర్మము కలుగును.

న యుక్తం తు మృషా వాణీ త్వయా వక్తు మరిందమ,

తథా మయాప్యభిహితం మిథ్యా కర్తుం న శక్యతే. 58

ఓ అరిమర్దనా! నీవు నీ మాటను పొల్లు చేయుట తగదు. అట్లే నేనును పలికిన దానిని కాదనజాలను.

సంశ్రుతం చ మయా పూర్వం దదానీ త్యవిచారితమ్,

తద్గృహ్ణీ ష్వావిచారేణ యది సత్యే స్థితో భవాన్. 59

నేను ఏమియు విచారింపక ఇత్తునని పూర్వము మాట యిచ్చితిని. నీవును మాటపై నిలుచువాడ వైనచో సంకోచింపక దానిని గ్రహింపుము.

ఇహా గమ్య హి మాం రాజన్ జాప్యం ఫల మయాచథాః,

తన్మే నిసృష్టం గృహ్ణీష్వ భవ సత్యే స్థిరోఽపి చ. 60

నీ విచటకు వచ్చి, రాజా! నన్ను ఫలమును కోరితివి. నేను దాని నొసగితిని. గ్రహింపుము. మాటపై గట్టిగా నిలబడుము.

నాయం లోకోఽస్తి నపరో నచ పూర్వాన్ సతారయేత్,

కుత ఏవ జనిష్యాంస్తు మృషా వాద పరాయణః. 61

కల్లలాడుటయే పని యైనవానికి ఈలోకము గాని, పరలోకము గాని లేదు. అతడు తనమునుపటి వంశమువారిని తరింపజేయుడు. ఇక పుట్టబోవు వారి సంగతి చెప్పనేల?

నయజ్ఞ ఫల దానాని నియమా స్తారయన్తి హి,

యథా సత్యం పరే లోకే తథేహ పురుషర్షభ. 62

ఓయి పురుషవరా! సత్యము పరలోకమున తరింపజేయునట్లు, యజ్ఞ ఫలదానములు నియమములు తరింపజేయ జాలవట!

తపాంసి యాని చీర్ణాని చరిష్యన్తి చ యత్తపః,

శతైః శతసహస్రైశ్చ తైః సత్యాన్న విశిష్యతే. 63

ఇంతకు మునుపు చేసిన తపములు, ఇటుపై చేయబోవు తపములు, వందలు, వందల వేలు అయినను సత్యము కంటె మించవు.

సత్య మేకాక్షరం బ్రహ్మ సత్య మేకాక్షరం తపః,

సత్య మేకాక్షరో యజ్ఞః సత్య మేకాక్షరం శ్రుతమ్. 64

సత్యము సాటిలేని, వినాశము లేని బ్రహ్మము. సత్యము ఏకాక్షరమగు తపము. సత్య మేకాక్షరమగు యజ్ఞము. సత్యము ఏకాక్షరమగు జ్ఞానము.

సత్యం వేదేషు జాగర్తి ఫలం సత్యే పరం స్మృతమ్,

సత్యా ద్ధర్మో దమశ్చైవ సర్వం సత్యే ప్రతిష్ఠితమ్. 65

సత్యము వేదములయందు మేల్కొని యుండును. సత్యమునందలి ఫలము పరమమైనది. సత్యమువలన ధర్మము దమము కలుగును. సత్యము నందంతయు నెలకొని యున్నది.

సత్యం వేదా స్తథాఙ్గాని సత్యం విద్యా స్తథా విధిః,

వ్రతచర్యా తథా సత్య మోఙ్కారః సత్య మేవచ. 66

వేదములు, అంగములు, విద్యలు, విధులు, వ్రతచర్యలు అన్నియు సత్యమే. ఓంకారము కూడ సత్యస్వరూపమే.

ప్రాణినాం జననం సత్యం సత్యం సన్తతి రేవ చ,

సత్యేన వాయు రభ్యేతి సత్యేన తపతే రవిః. 67

ప్రాణుల పుట్టుక, సంతానము అనునదంతయు సత్యస్వరూపమే. సత్యముచేతనే వాయువు కదలుచున్నది. సత్యము చేతనే సూర్యుడు వెలుగొందుచున్నాడు.

సత్యేన చాగ్ని ర్దహతి స్వర్గః సత్యే ప్రతిష్ఠితః,

సత్యం యజ్ఞ స్తపో వేదాః స్తోభా మన్త్రాః సరస్వతీ. 68

సత్యముచేతనే అగ్ని కాలుచున్నది. సత్యమునందే స్వర్గము ప్రతిష్ఠ నొందుచున్నది. సత్యమే యజ్ఞము, తపస్సు, వేదములు, స్తోభములు, మంత్రములు, సరస్వతియు.

తులా మారోపితో ధర్మః సత్యం చైవేతి నఃశ్రుతమ్,

సమకక్షాం తులయతో యతః సత్యం తతోఽధికమ్. 69

ధర్మమును సత్యమును తులపై నుంచిరని మేము వినియుంటిమి. తూచుటకై చేసిన ఆ పనిలో సత్యమున్న వైపే మొగ్గు చూపినది.

యతో ధర్మ స్తతః సత్యం సర్వం సత్యేన వర్ధతే,

కిమర్థ మనృతం కర్మ కర్తుం రాజం స్త్వ మిచ్ఛసి. 70

ధర్మ మెటు వైపున నుండునో సత్య మచటనే యుండును. సర్వమును సత్యము చేతనే వృద్ధి పొందును. రాజా! అసత్యమగు కర్మము నాచరింపగోరుదు వేల?

సత్యే కురు స్థిరం భావం మా రాజ న్ననృతం కృథాః,

కస్మాత్త్వ మనృతం వాక్యం దేహీతి కురుషేఽశుభమ్. 71

రాజా! సత్యమున స్థిరభావమును చేయుము. అనృతము చేయకుము. ‘ఇమ్ము’ అను వాక్యమును అశుభము, అనృతము అయినదిగా ఏల చేయుదువు?

యది జప్యఫలం దత్తం మయా నైషిష్యసే నృప,

ధర్మేభ్యః సంపరిభ్రష్టో లోకా ననుచరిష్యసి. 72

నేను జపఫలము నొసగగా నీవు దానిని అంగీకరింప కుందువేని ధర్మములనుండి పరిభ్రష్టుడవై పాపలోకములకు పోవుదువు.

సంశ్రుత్య యో న దిత్సేత యాచిత్వా యశ్చ నేచ్ఛతి,

ఉభా వనృతకా వేతౌ నమృషా కర్తుమర్హసి. 73

మాటయిచ్చి ఈయగోరనివాడు, అడుగుకొని పుచ్చుకొనగోరనివాడు - ఈ యిరువురును అబద్ధాల కోరులే యగుదురు. కనుక అసత్యము చేయగోరకుము.

రాజోవాచ - రాజు పలికెను.

యోద్ధవ్యం రక్షితవ్యం చ క్షత్రధర్మః కిల ద్విజ,

దాతారః క్షత్రియాః ప్రోక్తా గృహ్ణీయాం భవతః కథమ్. 74

పోరొనర్చుట, రక్షించుట అనునవి కదా క్షత్రధర్మములు. రాజులు దాతలని చెప్పబడుదురు. అట్టి నేను నీనుండి యెట్లు గ్రహింతును?

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.

నచ్ఛందయామి తే రాజ న్నాపి తే గృహ మావ్రజమ్,

ఇహాగమ్యతు యాచిత్వా న గృహీషే పునః కథమ్. 75

రాజా! నేను నీ యింటికి రాలేదు. నన్నడుగుమని ఒత్తిడి చేయలేదు. నీవై యిచటకు వచ్చి, అడిగి, గ్రహింపవిది యేమి?

ధర్మ ఉవాచ - ధర్ము డిట్లనెను.

అవివాదోఽస్తు యువయో ర్విత్తం మాం ధర్మ మాగతమ్,

ద్విజో దానఫలై ర్యుక్తో రాజా సత్యఫలేన చ. 76

మీ యిరువురకు వివాదమింక వలదు. ఇటకు వచ్చిన ధర్మునిగా మీరిరువురు నన్నెరుగుడు. ఈ ద్విజుడు దానఫలములను, రాజు సత్యఫలములను పొందుదురు గాక!

స్వర్గ ఉవాచ - స్వర్గ మిట్లనెను.

స్వర్గం మాం విద్ధి రాజేన్ద్ర రూపిణం స్వయమాగతమ్,

అవివాదోఽస్తు యువయో రుభౌ తుల్యఫలౌ యువామ్ . 77

రాజేంద్రా! నన్ను రూపము తాల్చి స్వయముగా వచ్చిన స్వర్గముగా నెరుగుడు. మీ యిరువురకు వివాదము లేకుండుగాక! ఇద్దరు సమానమగు ఫలము కలవారగుదురు గాక!

రాజోవాచ - రాజిట్లు పలికెను.

కృతం స్వర్గేణ మే కార్యం గచ్ఛ స్వర్గం యథాగతమ్,

విప్రో యదీచ్ఛతే గన్తుం చీర్ణం గృహ్ణాతు మే ఫలమ్ . 78

నాకు స్వర్గముతో పని తీరిపోయినది. స్వర్గమా! నీవు నీ స్వర్గమునకు వచ్చినట్లే యరుగుము. ఈ విప్రు డచటికి పోగోరునేని నేను కూడబెట్టిన ఫలమును గ్రహించుగాక!

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడు పలికెను.

బాల్యే యది స్యాదజ్ఞానా న్మయా హస్తః ప్రసారితః,

నివృత్తలక్షణం ధర్మ ముపాసే సంహితం జపన్ . 79

చిన్ననాడు తెలియక ఒకవేళ నేను చేయి చాచితినేమో! ఇప్పుడు నివృత్తి లక్షణముగల ధర్మమును, మంత్రమును జపించుచు, ఉపాసించుచున్నాను.

నివృత్తం మాం చిరా ద్రాజన్ విప్ర లోభయసే కథమ్,

స్వేన కార్యం కరిష్యామి త్వత్తో నేచ్ఛే ఫలం నృప.

తపః స్వాధ్యాయశీలోఽహం నివృత్తశ్చ ప్రతిగ్రహాత్. 80

రాజా! ప్రతిగ్రహమునుండి మరల నన్నూరక ఊరింతువేల? నా పనిని నాయంత నేను చేసికొనగలను. నీనుండి ఫలము నపేక్షింపను. తపస్సు, వేదాధ్యయనము అనునవి శీలముగా గల నేను ప్రతిగ్రహమునుండి మరలితిని.

రాజోవాచ - రాజు ఇట్లనెను.

యది విప్ర విసృష్టం తే జప్యస్య ఫల ముత్తమమ్,

ఆవయో ర్యత్ఫలం కిఞ్చిత్సహితం నౌ తదస్త్విహ . 81

విప్రా! నీవు నీ జపఫలమును ఉత్తమమైన దానిని ఇచ్చివేసితివి. కనుక మన యిరువురి ఆ ఫలము ఇచట కూడినది యగుగాక!

ద్విజాః ప్రతిగ్రహే యుక్తా దాతారో రాజవంశజాః,

యది ధర్మః శ్రుతో విప్ర సహైవ ఫలమస్తు నౌ . 82

బ్రాహ్మణులు దానము పుచ్చుకొనుట కర్హులు. రాజవంశము వారు దాతలు, ఓ విప్రా! ఈ ధర్మము నీచెవిని బడియున్నచో మనయిరువురి ఫలము కలిసియే ప్రవర్తిల్లును గాక!

మా వా భూత్సహభోజ్యం నౌ మదీయం ఫల మాప్నుహి,

ప్రతీచ్ఛ మత్కృతం ధర్మం యది తే మయ్యనుగ్రహః . 83

అది యట్లు మన యిరువురము కలిసి అనుభవించెడిది కాకున్నచో నాదైన ధర్మఫలమును నీవు పొందుము. నాయందనుగ్రహము ఉన్నచో నేను చేసిన ధర్మములు స్వీకరింపుము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

తతో వికృతరూపౌ ద్వౌ పురుషౌ సముపస్థితౌ,

గృహీత్వాఽన్యోన్య మావేష్ట్య కుచైలా వూచతు ర్వచః . 84

అంత నచటికి వికృతరూపులగు పురుషు లిరువురు వచ్చిరి. వారి నొకరి నొకరు చుట్టబెట్టుకొని లాగుకొనుచు చినుగు గుడ్డలవారై యిట్లు పలికిరి.

న మే ధారయసీ త్యేకో ధారయామీతి చాపరః,

ఇహాస్తి నౌ వివాదోఽయ మయం రాజానుశాసకః . 85

నీవు నాకప్పుపడలేదని యొకడు, పడితినని మరియొకడు పలుకుచు ఇదిగో మాకీ వివాదము కలిగినది. ఇతడు ధర్మమును శాసించు రాజు - అనుచు వచ్చిరి.

సత్యం బ్రవీమ్యహ మిదం న మే ధారయతే భవాన్,

అనృతం వద సీహ త్వ మృణం తే ధారయా మ్యహమ్. 86

నేను సత్యము పలుకుచున్నాను. నీవు నాకు ఋణపడియుండలేదు. నీవు అబద్ధము పలుకుచున్నావు. నేను నీకు అప్పుపడియున్నాను.”

తావుభౌ సుభృశం తప్తౌ రాజాన మిద మూచతుః,

పరీక్ష్య త్వం యథా స్యావో నావా మిహ విగర్హితా. 87

వారిద్దరు మిక్కిలి ఉడికిపోవుచున్నవారై రాజుతో ఇట్లనిరి. నీవు పరీక్షించి మే మిరువురము నిందనొందకుండు విధమును చేయవలయును.

విరూప ఉవాచ - విరూపు డిట్లనెను.

ధారయామి నరవ్యాఘ్ర వికృతస్యేహ గోఃఫలమ్,

దదతశ్చన గృహ్ణాతి వికృతో మే మహీపతే . 88

రాజా! ఈ వికృతునకు నేను జపఫలమును అప్పుపడితిని. ఈ వికృతుడు నేను ఇచ్చుచుండగా గ్రహింపకున్నాడు.

వికృత ఉవాచ - వికృతు డిట్లనెను.

నమే ధారయతే కిఞ్చి ద్విరూపోఽయం నరాధిప,

మిథ్యా బ్రవీత్యయం హి త్వాం సత్యాభాసం నరాధిప. 89

రాజా! ఈ విరూపుడు నాకేమియు అప్పుపడలేదు. పైకి సత్యమువలె కన్పట్టు అబద్ధమును నీతో పలుకుచున్నాడు.

రాజోవాచ - రాజిట్లనెను.

విరూప కిం ధారయతే భవా నస్య బ్రవీతు మే,

శ్రుత్వా తథా కరిష్యేఽ హ మితి మే ధీయతే మనః . 90

ఏమోయి విరూపా! నిజము చెప్పుము. నీవు ఈతనికి అప్పుపడితివా? అది విని నేను చేయవలసిన దానిని చేసెదను. నామనసిట్లు భావించుచున్నది.

విరూప ఉవాచ - విరూపు డిట్లనెను.

శృణు ష్వావహితో రాజన్ యథైతద్ధారయామ్యహమ్,

వికృతస్యాస్య రాజర్షే నిఖిలేన నరాధిప . 91

ఓ రాజర్షీ! ఈ వికృతునకు నేనెట్లు ఋణపడితినో అంతయు చెప్పెదను. శ్రద్ధగా వినుము.

అనేన ధర్మప్రాప్త్యర్థం శుభా దత్తా పురాఽనఘ,

ధేను ర్విప్రాయ రాజర్షే తపః స్వాధ్యాయ శీలినే . 92

మునుపితడు మంచిగోవును ధర్మము పొందుటకొరకు, తపస్సు, వేదాధ్యయనము శీలముగా గల విప్రున కొసగెను.

తస్యా శ్చాయం మయా రాజన్ ఫలమభ్యేత్య యాచితః,

వికృతేన చ మే దత్తం విశుద్ధే నాస్తరాత్మనా. 93

నేను ఈతనికడ కరిగి దాని ఫలమును యాచించితిని. స్వచ్ఛమగు అంతరాత్మతో ఈ వికృతుడు దానిని నాకు దానమిచ్చెను.

తతో మే సుకృతం కర్మ.కృత మాత్మవిశుద్ధయే,

గావౌ చ కపిలే క్రీత్వా వత్సలే బహుదోహనే. 94

తే చోంఛ వృత్తయే రాజ న్మయా సమపవర్జితే,

యథావిధి యథా శ్రద్ధం తదస్యాహం పునః ప్రభో. 95

ఇహాద్యైవ గృహీత్వా తు ప్రయచ్ఛే ద్ద్విగుణం ఫలమ్,

ఏవం స్యాత్పురుష వ్యాఘ్ర కఃశుద్ధః కోఽత్ర దోషవాన్ . 96

అటుపై నేను పుణ్యకార్యమును ఆత్మవిశుద్ధి కొరకు చేసితిని. ఎక్కువ పాలిచ్చునవి, దూడలు కలవియునగు రెండు ఆవులను కొని వానిని యథావిధిగ శ్రద్ధకు తగినట్లుగా ఉంఛవృత్తి గల ఈతనికి దానమొసగుటకై తెచ్చితిని. ఇప్పుడు ఇక్కడనే గ్రహించి యిచ్చినచో ఫలము రెట్టింపగును. ఇది యిట్లుండగా ఇందు శుద్ధుడెవడు? దోషము కలవాడెవడు?

ఏవం వివదమానౌ స్వస్త్వామిహా భ్యాగతౌ నృప,

కురు ధర్మ మధర్మం వా వినయే నౌ సమాదధ . 97

ఇట్లు మేము వాదులాడుచు ఇచట నీకడకు వచ్చితిమి. ధర్మమో, అధర్మమో నీవే నిర్ణయింపుము. మాకు సరియగు సమాధానము చెప్పుము.

యది నేచ్ఛతి మే దానం యథా దత్త మనేన వై,

భవా నత్ర స్థిరో భూత్వా మార్గే స్థాపయితాఽద్య నౌ . 98

నా దానము నీతడు ఇష్టపడని నాకెట్లు ఈతడు దానమొసగెను? ఇందు నీవు గట్టిగా నిలబడి మా యిద్దరిని ఒక దారిలో పెట్టుము.

రాజోవాచ - రాజిట్లనెను.

దీయమానం నగృహ్ణాసి ఋణం కస్మాత్త్వమద్య వై,

యథైవ తేఽభ్యనుజ్ఞాతం తథా గృహ్ణీష్వ మాచిరమ్. 99

తిరిగి ఇచ్చుచున్న ఋణమును నీ వేకారణమున గ్రహింపవు? నీ అనుమతిని పొందిన విధముగా ఇచ్చెడు దానిని ఆలసింపక తీసికొనుము.

వికృత ఉవాచ - వికృతు డిట్లనెను.

ధారయామీత్యనేనోక్తం దదానీతి తథా మయా,

నాయం మే ధారయత్యద్య గచ్ఛతాం యత్ర వాంఛతి. 100

ఇతడు అప్పుపడెనని పలికెను. ఇచ్చెదను అని నేనంటిని. నేను ఇప్పుడు అప్పుపడలేదు. అతడు కోరినచోటి కరుగవచ్చును.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

దదతోఽస్య న గృహ్ణాసి విషమం ప్రతిభాతి మే,

దణ్డ్యో హి త్వం మమ మతో నాస్త్యత్ర ఖలు సంశయః. 101

ఇత డిచ్చుచుండగా నీవు తీసికొనకున్నావు. ఇది నాకు విపరీతముగా కన్పట్టుచున్నది. నా అభిప్రాయములో నీవు దండింపదగినవాడవు. ఇందు సంశయము లేదు.

వికృత ఉవాచ - వికృతుడిట్లనెను.

మయాస్య దత్తం రాజర్షే గృహ్ణీయాం తత్కథం పునః,

కామ మత్రాపరాధో మే దణ్డ మాజ్ఞాపయ ప్రభో. 102

రాజర్షీ! నేనతని కొసగినదానిని మరల ఎట్లు పుచ్చుకొందును? ఇందు నా అపరాధమేమో గుర్తించి దండమును ఆజ్ఞాపింపుము.

విరూప ఉవాచ - విరూపు గిట్లనెను.

దీయమానం యది మయా నేషిష్యసి కథంచన,

నియంస్యతి త్వాం నృపతి రయం ధర్మాను శాసకః. 103

నేనిచ్చుదానిని నీవెన్నటికి గ్రహింపవేని, ధర్మమును పాలించు ఈ రాజు నిన్ను నిగ్రహించును.

వికృత ఉవాచ - వికృతు డిట్లు పలికెను.

స్వం మయా యాచితే నేహ దత్తం కథమిహాద్యతత్,

గృహ్ణీయాం గచ్ఛతు భవా నభ్యనుజ్ఞాం దదాని తే. 104

నన్నడుగగా సొమ్మునిచ్చితిని. మరల ఇప్పుడు దానిని నేనెట్లు తీసికొందును? నీవరుగుము. నీ కనుమతి నిచ్చెదను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లనెను.

శ్రుత మేతత్త్వయా రాజ న్ననయోః కథితం ద్వయోః,

ప్రతిజ్ఞాతం మయా యత్తే తద్గృహాణా విచారితమ్ . 105

రాజా! ఈ యిరువురు చెప్పిన మాట వింటివా? అట్లే నేనును ఇత్తునని చెప్పినదానిని ఆలోచింపక గ్రహింపుము.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

ప్రస్తుతం సుమహత్కార్య మనయో ర్గహ్వరం యథా,

జాపకస్య దృఢీకారః కథ మేత ద్భవిష్యతి . 106

ప్రస్తుతమగు ఈ మహాకార్యము వీరిరువురి కార్యమువలె మిక్కిలి గంభీరమైనది. జాపకుని గట్టితనమను నిది ఏమి కానున్నది?

యది తావ న్నగృహ్ణామి బ్రాహ్మణే నాపవర్జితమ్,

కథం లిప్యేయ మహం పాపేన మహతాఽద్య వై . 107

బ్రాహ్మణుడు వదలిన దీనిని గ్రహింపకుందునేని గొప్ప పాపము అంటక నేనెట్లుందును?

తౌ చోవాచ స రాజర్షిః కృతకార్యౌ గమిష్యథ,

నేదానీం మామిహాసాద్య రాజధర్మో భవేన్మృషా . 108

ఆ రాజర్షి వారిరువురితో ఇట్లనెను. మీరు కార్యము తీరినవారై వెళ్లెదరు. నన్ను చేరుకొని రాజధర్మము అబద్ధము కారాదు.

స్వధర్మః పరిపాల్యస్తు రాజ్ఞా మితి వినిశ్చయః,

విప్రధర్మశ్చ గహనో మామనాత్మాన మావిశత్. 109

రాజులు స్వధర్మమును చక్కగా పాలింపవలయునని నిర్ణయము. చొరనలవికాని విప్రధర్మము నా నీచబుద్ధిని ఆవేశించెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

గృహాణ ధారయేఽహం చ యాచితం సంశ్రుతం మయా,

న చేద్గ్రహీష్యసే రాజన్ శపిష్యే త్వాం న సంశయః . 110

నేను నీకప్పు పడితిని. తీసికొనుము. నీవు నన్నడిగితివి. నేను మాట యిచ్చితిని. నీవు గ్రహింపకున్నచో రాజా! నేను నిన్ను శపింతును. సంశయము లేదు.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

ధిగ్రాజధర్మం యస్యాయం కార్యస్యేహ వినిశ్చయః,

ఇత్యర్థం మేగ్రహీతవ్యం కథం తుల్యం భవేదితి . 111

ఛీ! రాజ ధర్మమెంత నీచమైనది! ఈ పని నిర్ణయము ఇటువంటిదాయెను. ఈ అర్థమును నేను గ్రహింపవలయును. ఈ రాజధర్మము బ్రాహ్మణ ధర్మముతో ఎట్లు తుల్యమగును?

ఏష పాణి ర పూర్వం మే నిక్షేపార్థం ప్రసారితః,

యన్మే ధారయసే విప్ర తదిదానీం ప్రదీయతామ్. 112

ఈ నా చేతిని ఇంతకు మునుపు నిక్షేపముకొరకు చూచియుండలేదు. ఓయి విప్రా! నాకు అప్పుపడిన దానిని ఇప్పు డిమ్ము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.

సంహితాం జపతా యావాన్ గుణః కశ్చిత్కృతో మయా,

తత్సర్వం ప్రతిగృహ్ణీష్వ యది కిఞ్చిదిహాస్తి మే . 113

సంహితను జపించుచు నేను ఎంత గుణమును సాధించినది ఏది యేది కలదో, దానినంతటిని తీసికొనుము.

రాజోవాచ - రాజిట్లనెను.

జల మేత న్నిపతితం మమ పాణౌ ద్విజోత్తమ,

సమమస్తు సహైవాస్తు ప్రతిగృహ్ణాతు వై భవాన్. 114

బ్రాహ్మణోత్తమా! ఈ జలము నాచేతియందు ఉంచబడినది. ఇది సమమగు గాక! కలిసియే యుండుగాక! తమరు స్వీకరింపుడు.

విరూప ఉవాచ - విరూపు డిట్లనెను.

కామక్రోధౌ విద్ధి నౌ త్వమావాభ్యాం కారితో భవాన్,

సహేతి చ యదుక్తం తే సమా లోకా స్తవాస్య చ. 115

రాజా! మమ్ములను కామక్రోధములుగా ఎరుగుము. నిన్ను మేమే యిట్లు చేసితిమి. 'కలిసి' అని నీవు పలికినట్లు నీకును, ఇతనికిని లోకములు సమములే యగుగాక!

నాయం ధారయతే కిఞ్చి జ్జిజ్ఞాసా త్వత్కృతే కృతా,

కాలో ధర్మస్తథా మృత్యుః కామక్రోధౌ తథా యువామ్. 116

సర్వమన్యోన్య నిష్కర్షే నిఘృష్టం పశ్యత స్తవ,

గచ్ఛ లోకాన్ జితాన్ స్వేన కర్మణా యత్ర వాంఛసి. 117

ఇత డే కొంచెము ఋణపడలేదు. నీకు జ్ఞానబోధ చేయుటకై యిది యంతయు ఏర్పాటుచేయబడినది. కాలుడు, ధర్ముడు, మృత్యువు, కామ క్రోధములు, మీరిరువురు - ఒకరినొకరు చర్చించుకొని నీవు చూచుచుండగా నిన్ను పరీక్షించిరి. ఈ నీదగు కర్మముతో పుణ్యలోకముల నన్నింటిని జయించితివి. కోరినచోటి కరుగుము.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

జాపకానాం ఫలా వాప్తి ర్మయా తే సంప్రదర్శితా,

గతిః స్థానం చ లోకాశ్చ జాపకేన యథా జితాః. 118

జపపరాయణులు ఫలము పొందుట యెట్లో నేను నీకు నిరూపించితిని. వారి గతి, స్థానము, లోకములు అనునవి సాధింపబడు తీరులను వివరించెదను.

ప్రయాతి సంహితాధ్యాయీ బ్రహ్మాణం పరమేష్ఠినమ్,

అథవాఽగ్నిం సమాయాతి సూర్య మావిశతేఽపి వా. 119

వేదసంహితను అధ్యయనము చేయువాడు పరమేష్ఠియగు బ్రహ్మనో, అగ్నినో, సూర్యునో చేరుకొనును.

స తైజసేన భావేన యది తత్ర రమత్యుత,

గుణాం స్తేషాం సమాధత్తే రాగేణ ప్రతిమోహితః. 120

ఆతడు తేజోమయభావముతో అందు ఆనందపడునేని రాగముతో ప్రతిమోహితుడై వారి గుణములను పొందును.

ఏవం సోమే తథా వాయౌ భూమ్యాకాశశరీరగః,

సరాగ స్తత్ర వసతి గుణాంస్తేషాం సమాచరన్. 121

అట్లే చంద్రునియందు, వాయువునందు, భూమి, ఆకాశము అనువాని శరీరములను పొంది సంచరించువాడై, అందు రాగము కలవాడై వారి గుణములను సమాచరించుచు అందే వసించును.

అథ తత్ర విరాగీ స గచ్ఛతి త్వథ సంశయమ్,

పర మవ్యయ మిచ్ఛన్ స తమే వావిశతే పునః. 122

అట్లుకాక అందు విరాగములేనివాడైనచో, లేదా సంశయము పొందినవాడైనచో, పరము, అవ్యయమునగు తత్త్వమును కాంక్షించుచు ఆ పరమేష్ఠినే చేరుకొనును.

అమృతాచ్చామృతం ప్రాప్తః శాన్తీభూతో నిరాత్మవాన్,

బ్రహ్మభూతః స నిర్ద్వన్ద్వః సుఖీ శాన్తో నిరామయః. 123

అమృతమునుండి అమృతమును పొందినవాడు, శాంతీభూతుడు, నిరాత్ముడు, బ్రహ్మభూతుడు, ద్వంద్వములేని వాడు, సుఖవంతుడు, శాంతుడు, నిరామయుడు నగును.

బ్రహ్మస్థాన మనావర్త మేక మక్షర సంజ్ఞకమ్,

అదుఃఖ మజరం శాస్త్రం స్థానం తత్ప్రతిపద్యతే. 124

తిరిగివచ్చెడు స్థితిలేనిది, ఏకము, అక్షరమను పేరుకలది, దుఃఖము లేనిది, ముదిమిలేనిది, శాంతము అగు బ్రహ్మస్థానము నతడు పొందును.

చతుర్భి ర్లక్షణై ర్హీనం తథా షడ్భిః సషోడశైః,

పురుషం తమతిక్రమ్య ఆకాశం ప్రతిపద్యతే. 125

నాలుగు లక్షణములులేనివాడు, అట్లే ఆరింటితో, పదునారింటితో కూడనివాడు అగు పురుషుని, ఆకాశము నతిక్రమించి, చేరుకొనును.

అథ నేచ్ఛతి రాగాత్మా సర్వం తదధితిష్ఠతి,

యచ్చ ప్రార్థయతే తచ్చ మనసా ప్రతిపద్యతే. 126

అట్లుకాక రాగమునందు బుద్ధికలవాడై ఆ పురుషుని కోరనివాడైనచో సర్వము నధిష్ఠించి మనస్సు దేనిని కోరునో ఆ రూపమును పొందును.

అథవా చేక్షతే లోకాన్ సర్వా న్నిరయసంశ్రితాన్,

నిఃస్పృహాః సర్వతో ముక్త స్తత్ర వై రమతే సుఖమ్. 127

అట్లు కాక లోకములన్నియు నిరయమునాశ్రయించినవని పరిశీలించువాడైనచో నిస్పృహుడై అన్నింటినుండి ముక్తిపొందినవాడై అందు సుఖముగా రమించును.

ఏవ మేవ మహారాజ జాపకస్య గతి ర్యథా,

ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతు మర్హసి. 128

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
జాపకోపాఖ్యానే
వత్యధిక శతతమోఽధ్యాయః

మహారాజా! ఇట్లు నీకు జాపకుని గతిని గూర్చి సర్వమును చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుదువు?

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున
జాపకోపాఖ్యానము గల నూటతొంబది తొమ్మిదవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరుడిట్లు పలికెను.

కి ముత్తరం తదా తౌ స్మ చక్రతు స్తస్యభాషితే,

బ్రాహ్మణో వాఽథ వా రాజా తన్మే బ్రూహి పితామహ . 1

ఆ విరూపుని మాటను విన్న తరువాత ఆ బ్రాహ్మణుడును, ఆ రాజును ఏమి చేసిరో తాతా! దానిని నాకు చెప్పుము.

అథవా తౌ గతౌ తత్ర యదేత త్కీర్తితం త్వయా,

సంవాదో వా తయోః కోఽభూత్ కిం వా తౌ తత్ర చక్రతుః . 2

లేక వారిరువురు నీవు చెప్పినలోకముల కరిగిరా? పిదప వారిరువురకు నయిన సంవాదమెట్టిది? అందు వారేమి చేసిరి?

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

తథేత్యేవం ప్రతిశ్రుత్య ధర్మం సంపూజ్య చ ప్రభో,

యమం కాలం చ మృత్యుం చ స్వర్గం సంపూజ్య చార్హతః . 3

పూర్వం యే చాపరే తత్ర సమేతా బ్రాహ్మణర్షభాః,

సర్వాన్ సంపూజ్య శిరసా రాజానం సోఽబ్రవీ ద్ద్విజః . 4

అట్లే యని మాటనొసగి ధర్ముని, యముని, కాలుని, మృత్యువును, స్వర్గమును, ఇతర పూజ్యులను చక్కగా పూజించి, మరియు అచటకు చేరవచ్చిన బ్రాహ్మణ శ్రేష్ఠులను తలవంచి గౌరవించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను.

ఫలే నానేన సంయుక్తో రాజర్షే గచ్ఛ ముఖ్యతామ్,

భవతా చాభ్యనుజ్ఞాతో జపేయం భూయ ఏవ హి . 5

రాజర్షీ! ఈ ఫలముతో కూడినవాడవై నీవు గణనీయస్థితిని పొందుము. నీ వనుమతింపగా నేనును మరల జపము చేసికొందును.

వరశ్చ మమ పూర్వం హి దత్తో దేవ్యా మహాబల,

శ్రద్ధా తే జపతో నిత్యం భవత్వితి విశాంపతే. 6

ఓ మహాబలా! పూర్వము దేవి నాకు జపమొనరించు నీకు చెడని శ్రద్ధ కలుగుగాక! అని వరమును కూడ ఇచ్చెను.

రాజోవాచ - రాజిట్లనెను.

యద్యేవ మఫలా సిద్ధిః శ్రద్ధా చ జపితుం తవ,

గచ్ఛ విప్ర మయా సార్ధం జాపకం ఫల మాప్నుహి . 7

ఈ విధముగా నీసిద్ది ఫలములేనిది అయినను ఓ విప్రుడా! పొమ్ము. నాతోపాటు జపమువలన కలిగెడు ఫలమును పొందుము.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లనెను.

కృతః ప్రయత్నః సుమహాన్ సర్వేషాం సన్నిధా విహ,

సహ తుల్య ఫలా వావాం గచ్ఛావో యత్ర నౌ గతిః . 8

ఈ అందరి యెదుట పెద్ద ప్రయత్నము చేసితిమి. కలిసి సమానమగు ఫలము పొందిన మన మిరువురము మన మన తావుల కరుగుదము.

వ్యవసాయం తయో స్తత్ర విదిత్వా త్రిదశేశ్వరః,

సహ దేవై రుపయయౌ లోకపాలై స్తథైవ చ . 9

ఆ యిద్దరి వ్యవసాయమును తెలిసికొని దేవేంద్రుడు, దేవతలతో, లోకపాలురతో పాటుగా నచటకు వచ్చెను.

సాధ్యాశ్చ విశ్వే మరుతో వాద్యాని సుమహాన్తి చ,

నద్యః శైలాః సముద్రాశ్చ తీర్థాని వివిధాని చ. 10

తపాంసి సంయోగవిధి ర్వేదాః స్తోభాః సరస్వతీ,

నారదః పర్వతశ్చైవ విశ్వావసు ర్హహా హుహూః . 11

గన్ధర్వ శ్చిత్రసేనశ్చ పరివారగణై ర్యుతః,

నాగాః సిద్ధాశ్చ మునయో దేవదేవః ప్రజాపతిః, 12

విష్ణుః సహస్రశీర్షశ్చ దేవోఽ చిన్త్యః సమాగమత్.

సాధ్యులు, విశ్వదేవతలు, మరుత్తులు, గొప్పవాద్యములు, నదులు, కొండలు, సముద్రములు, వివిధములగు తీర్థములు, తపస్సులు, వేదాంతములు, వేదములు, స్తోభములు, సరస్వతి, నారదుడు, విశ్వావసువు, హహాహుహువు, పరివారగణములతో కూడిన గంధర్వుడు చిత్రసేనుడు, నాగులు, సిద్ధులు, మునులు, దేవదేవుడగు ప్రజాపతి, వేయి తలలు గలవాడు, ఊహకందని వాడునగు విష్ణుదేవుడు - వీరందరు వచ్చిరి.

అవాద్యన్తా న్తరిక్షే చ భేర్య స్తూర్యాణి వా విఖో, 13

పుష్పవర్షాణి దివ్యాని తత్ర తేషాం మహాత్మనామ్,

ననృతు శ్చాప్సరః సంఘా స్తత్ర తత్ర సమస్తతః . 14

అంతరిక్షమున భేరులు, వాద్యములు మ్రోగినవి. అందామహాత్ముల దివ్యములగు పూలవానలు కురిసినవి. అప్సరసల గుంపులు అందందు నిండుగా నృత్యములొనర్చెను.

అథ స్వర్గ స్తథా రూపీ బ్రాహ్మణం వాక్య మబ్రవీత్,

సంసిద్ధ స్త్వం మహాభాగ స్త్వం చ సిద్ధ స్తథా నృప . 15

అంత రూపముతాల్చి వచ్చిన స్వర్గము బ్రాహ్మణునితో ఇట్లు పలికెను. ఓయి! నీవు పుణ్యాత్ముడవు సంసిద్ధి నందితివి. ఓ రాజా! నీవును సిద్ధుడవయితివి.

అథ తౌ సహితౌ రాజ న్నన్యోన్యవిధినా తతః,

విషయ ప్రతి సంహార ముభా వేవ ప్రచక్రతుః . 16

రాజా! అంత నాయిరువురు ఒకరినొకరు ఉపకారము చేసికొను పనితో కలిసినవారై విషయములను అణచివేయుటను ఇద్దరు ఆచరించిరి.

ప్రాణాపానౌ తథోదానం సమానం వ్యాన మేవ చ,

ఏవం తౌ మనసి స్థాప్య దధతుః ప్రాణయో ర్మనః. 17

ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అనువానిని మనస్సునందు నెలకొల్పి ప్రాణములను మనస్సునందు నిలిపిరి.

ఉపస్థితకృతౌ తౌ చ నాసికాగ్ర మధో భ్రువోః,

భ్రుకుట్యా చైవ మనసా శనై ర్ధారయత స్తదా. 18

పద్మాసనము వేసికొన్నవారై కనుబొమల క్రింద నాసికాగ్రమును చూచుచు, మనస్సుతోపాటు ఆ ప్రాణాపానములను కనుబొమల నడుమ ప్రదేశమున మెల్లగా నిలుపుకొనిరి.

నిశ్చేష్టాభ్యాం శరీరాభ్యాం స్థిరదృష్టీ సమాహితౌ,

జితాత్మానౌ తథాఽఽదాయ మూర్ధన్యాత్మాన మేవ చ 19

చేష్టలుడిగిన శరీరములతో, కదలని దృష్టులు కలవారై, నిశ్చలభావముతో, మనస్సును జయించినవారై ఆత్మను తలయందు నెలకొల్పుకొనియుండిరి.

తాలుదేశ మథోద్దాల్య బ్రాహ్మణస్య మహాత్మనః,

జ్యోతి ర్జ్వాలా సుమహతీ జగామ త్రిదివం తదా. 20

అప్పుడు మహాత్ముడగు బ్రాహ్మణుని బ్రహ్మరంధ్రమును పగులగొట్టి మిక్కిలి పెద్దదియగు జ్యోతిర్జ్వాల స్వర్గమున కరిగెను.

మహాకార స్తథా దిక్షు సర్వేషాం సుమహా నభూత్,

తజ్జ్యోతిః స్తూయమానం స్మ బ్రహ్మాణం ప్రావిశత్తదా. 21

అందరి హాహాకారము పెద్ద పెట్టున దిక్కులందు చెలరేగెను. అందరు కొనియాడుచుండగా ఆ జ్యోతి అప్పుడు బ్రహ్మను చేరుకొనెను.

తతః స్వాగత మిత్యాహ తత్తేజః ప్రపితామహః,

ప్రాదేశమాత్రం పురుషం ప్రత్యుద్గమ్య విశాంపతే. 22

జానెడు కొలతగల పురుష స్వరూపమైన ఆ వెలుగునకు ఎదురేగి బ్రహ్మ స్వాగతము పలికెను.

భూయశ్చైవాపరం ప్రాహ వచనం మధురం తదా,

జాపకై స్తుల్యఫలతా యోగానాం నాత్ర సంశయః. 23

మరియు మధురమగు నొక వాక్యము నిట్లు అతడు పలికెను. యోగులకు జాపకులతో సమానమగు ఫలము కలదు. ఇందు సంశయము లేదు.

యోగస్య తావ దేతేభ్యః ప్రత్యక్షం ఫలదర్శనమ్,

జాపకానాం విశిష్టం తు ప్రత్యుత్థానం సమాహితమ్ . 24

యోగియొక్క ఫలదర్శనము వీరికి ప్రత్యక్షము. జాపకులకన్ననో బ్రహ్మ ఎదురేగుట విశిష్టముగా ఏర్పడినది.

ఉష్యతాం మయి చేత్యుక్త్యా చేతయత్సతతం పునః,

అథాస్యం ప్రవిశేశాస్య బ్రాహ్మణో విగతజ్వరః . 25

నాయందు నీవు వసింతువు గాక అని పలికి ఆ జ్యోతికి మరల ఒకసారి చైతన్యము కలిపించెను. అంత నా బ్రాహ్మణుడు, ఎట్టి బాధలు లేనివాడై ఆ బ్రహ్మదేవుని ముఖములోనికి ప్రవేశించెను.

రాజాప్యేతేన విధినా భగవంతం పితామహమ్,

యథైవ ద్విజశార్దూల స్తథైవ ప్రావిశ త్తదా . 26

ఆ బ్రాహ్మణుడెట్లో అట్లే ఆ నృపతియు ఇదే విధితో భగవంతుడగు బ్రహ్మలోనికి ప్రవేశించెను.

స్వయంభువ మథో దేవా అభివాద్య తతోఽబ్రువన్,

జాపకానాం విశిష్టం తు ప్రత్యుత్థానం సమాహితమ్ . 27

అప్పుడు దేవతలందరు బ్రహ్మకు అభివాదము చేసి యిట్లు పలికిరి; జాపకులకు విశిష్టమగు ప్రత్యుత్థానము ఏర్పరచిరి.

జాపకార్థమయం యత్నో యదర్థం వయ మాగతాః,

కృతపూజా విమౌ తుల్యౌ త్వయా తుల్యఫలా విమౌ . 28

జాపకులకొరకు ఈ ప్రయత్నమని మేమందరము ఇచటకు వచ్చితిమి. పూజచేసిన వీరిరువురు సమానులు. అట్లే నీవు వీరిని సమానఫలము గలవారినిగా చేసితివి.

యోగ జాపకయో ర్దృష్టం ఫలం సుమహ దద్య వై,

సర్వాన్ లోకా నతిక్రమ్య గచ్ఛేతాం యత్ర వాంఛితమ్. 29

యోగులయు జాపకులయు గొప్పఫలమెట్టిదో ఈనాడు ప్రత్యక్షముగా చూచితిమి. లోకములనన్నింటిని దాటి వీరిరువురు అనంతసుఖము కల కోరిన చోటి కరుగుదురు.

బ్రహ్మోవాచ - బ్రహ్మ యిట్లు పలికెను.

మహాస్మృతిం పఠేద్యస్తు తథైవానుస్మృతిం శుభామ్,

తావప్యేతేన విధినా గచ్ఛేతాం మత్సలోకతామ్. 30

మహాస్మృతిని పఠించువాడును, శుభమైన అనుస్మృతిని పఠించువాడును ఇదే విధానముతో నా సాలోక్యమున కరుగుదురు.

యశ్చ యోగే భవేద్భక్తః సోఽపి నాస్త్యత్ర సంశయః,

విధినానేన దేహాన్తే మమ లోకా నవాప్నుయాత్.

సాధయే గమ్యతాం చైవ యథాస్థానాని సిద్ధయే 31

యోగమునందు భక్తిగలవాడును ఇదే విధానముతో దేహమునశించిన పిదప నాలోకములను పొందును. ఇందు సందియము లేదు.

మీ అందరి ఇష్టమును నేను నెరవేర్తును. సిద్ధికొరకు మీమీ స్థానముల కరుగుడు.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

ఇత్యుక్త్యా తు తదా దేవ స్తత్రై వాంతరధీయత,

ఆమన్త్య్ర చ తతో దేవా యయుః స్వంస్వం నివేశనమ్ . 32

అని పలికి ఆ దేవు డచటనే అంతర్ధానమందెను. దేవతలును సెలవుగైకొని తమతమ నెలవుల కరిగిరి.

తే చ సర్వే మహాత్మానో ధర్మం సత్కృత్య తత్ర వై,

పృష్ఠతో ఽనుయయూ రాజన్ సర్వే సుప్రీతచేతసః . 33

తక్కిన ఆ మహాత్ములందరు ధర్ముని సత్కరించి వారివెంటనే మిక్కిలి ప్రీతినొందిన హృదయములతో నరిగిరి.

ఏతత్ఫలం జాపకానాం గతిశ్చైషా ప్రకీర్తితా,

యథాశ్రుతం మహారాజ కిం భూయః శ్రోతు మిచ్ఛసి . 34

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
జాపకోపాఖ్యానే ద్విశతతమోఽధ్యాయః

మహారాజా! జపపరాయణులు పొందు ఫలమిట్టిది. గతి యిట్టిది. విన్న మేరకు, నీకు చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుదువు.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున
జాపకోపాఖ్యానము గల రెండువందల సంఖ్యగల అధ్యాయము.

191

బ్రహ్మచర్యము, గార్హస్థ్య ముల
ధర్మములు

191

ద్వినవత్యధిక శతతమోఽ ధ్యాయః

192

వానప్రస్థము, సంన్యాసము
అనువాని ధర్మములు

192

“పరై రదర్శితః పన్థాః శ్రుతియుక్తి బలాన్మయా |

యథా కథంచి దున్నీతః పణ్డితాః శోధయన్తు తమ్||

త్రినవత్యధిక శతతమోఽధ్యాయః

“మన సైవ కృతం రామ న శరీర కృతం కృతమ్ ।

యేనైవాలింగ్యతే కాన్తా తేనై వాలింగ్య తే సుతా ॥”

193

ఆచారవిధి

193

చతుర్నవత్యధిక శతతమోఽ ధ్యాయః

194

అధ్యాత్మ కథనము

194

పంచనవత్యధిక శతతమోఽ ధ్యాయః

సమాధినిర్ధూతమలస్య చేతసో

నివేశితప్యాత్మని యత్సుఖం భవేత్.

న శక్యతే వర్ణయితుం గిరా తదా
స్వయం తదన్తఃకరణేన గృహ్యతే
.

195

ధ్యాన యోగ కథనము

195

షణ్ణవత్యధిక శతతమోఽ ధ్యాయః

బహిర్గతాను నాడీషు వివిక్తా హృదయాదధి,

యథాస్య నాడ్యః పుంసః స్యు రధ్యాత్మం సర్వతోగతాః,

అధిభూతం తథైవాస్య వాయుమధ్యః సమన్తగాః,

ఏత స్మాదేవ నిఃసృత్య శరీరాత్సర్వతోగతాః,

అధిభూతాత్మ నైవాయం నాడీ లక్షణ వర్త్మనా,

ఆపూర్యేదం జగత్సర్వం స్థిత ఆధ్యాత్మికః పుమాన్,

196

జాపకోపాఖ్యానమ్

196

సప్తనవత్యధిక శతతమోఽ ధ్యాయః

197

జాపకుని ఉపాఖ్యానము

197

198

అష్టనవత్యధిక శతతమోఽ ధ్యాయః

198

జాపకోపాఖ్యానమ్

198

నవనవత్యధిక శతతమోఽధ్యాయః

“మనసా పాత్ర ముద్దిశ్య జలమధ్యే జలం క్షిపేత్,

దాతా తత్ఫల మాప్నోతి ప్రతిగ్రాహీ న దోషభాక్.

199

జాపకుని ఉపాఖ్యానము

199

ద్విశతతమోఽ ధ్యాయః

“సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య

మూర్ధ్న్యాధా యాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్”.

“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మామనుస్మరన్

యః ప్రయాతి సమద్భావం యాతి వాస్త్యత్ర సంశయః.”

“బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే

పరస్యాన్తేకృతాత్మానః ప్రవిశన్తి పరంపదమ్” ఇది ఆ స్మృతి వాక్యము.

200

జాపకుని ఉపాఖ్యానము

200